ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

May 26 2025 1:31 AM | Updated on May 26 2025 1:59 AM

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

పొదిలి: ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఇన్‌ గేట్‌ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్ల మండలం బచ్చలకూరపాడు పంచాయతీ మెట్టువారిపల్లి గ్రామానికి చెందిన మెట్టు మాధవరెడ్డి(27) బస్టాండ్‌ ఎదురుగా సాయిసూర్య లాడ్జిలో పనిచేస్తుంటాడు. ఆదివారం బస్టాండ్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని కిందపడి చక్రాలు ఎక్కడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడలో ఉంటున్న మాధవరెడ్డి ఇటీవలే స్వగ్రామం వచ్చి లాడ్జిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వవిరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇంటిపై పిడుగు

ముండ్లమూరు(కురిచేడు): ముండ్లమూరు మండలంలోని తూర్పు కంభంపాడు గ్రామంలో ఇంటిపై పిడుగు పడింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. గ్రామంలోని తొట్టెంపూడి ధనలక్ష్మి ఇంటిపై కప్పు చివరన పిడుగుపడి కప్పు విరిగి ఇంటిపక్కన భూమిలోకి వెళ్లిపోయింది. ఇంటి పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. పిడుగుపాటుకు చుట్టుపక్కల 12 గృహాల్లోని గృహోపకరణాలు షార్ట్‌ సర్క్యూట్‌కు గురయ్యాయి. ఇళ్లలోని టీవీలు, ఫ్రీజ్‌, కూలర్‌, మిక్సీలు కాలిపోవడంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జేవీవీ కృషి

పొదిలి: శాసీ్త్రయ సమాజ నిర్మాణానికి జన విజ్ఞాన వేదిక 37 ఏళ్లుగా అలుపెరుగని కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌ అన్నారు. స్థానిక ఎన్‌జీఓ హోంలో ఆదివారం జిల్లాస్థాయి విస్తృత సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి గురుస్వామి అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సభ్యత్వ నమోదు పోస్టర్‌ ఆవిష్కరించారు. మురళీధర్‌ మాట్లాడుతూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, అందరికీ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కల్పించాలనే ఆశయ సాధన కోసం జేవీవీని స్థాపించారన్నారు. ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజినీర్లు, మేధావులు, విద్యావంతులు జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరాలని కోరారు.రాష్ట్ర కమిటీ సభ్యులు వి.మాలకొండారెడ్డి, పి.స్వరూపరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక సమస్యలకు సైన్సు మాత్రమే పరిష్కారం చూపిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్సుకు, పరిశోధనలకు, అధ్యయనాలకు తగినన్ని నిధులు కేటాయించి ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహాసభలను ఆగస్టు 9వ తేదీన గిద్దలూరులో నిర్వహించాలని తీర్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.జయప్రకాష్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఖాజా హుస్సేన్‌, యు.వెంకటరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూదాల దేవ ప్రసాద్‌, ఎస్‌ఎండి.రఫీ, జి.శ్రీనివాసరెడ్డి, ఏ.విశ్వరూపం, వి.వెంకటేశ్వర్లు, ఎస్‌వి.రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement