
1.5 కేజీల గంజాయి పట్టివేత
కనిగిరి రూరల్: నిషేధిత మత్తు పదార్థం గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ పేర్కొన్నారు. కనిగిరి పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఎస్పీ ఉత్తర్వ్లు మేరకు ఈ నెల 5న కనిగిరిలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన సమయంలో అక్రమంగా గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు గుర్తించామన్నారు. మంచినీటి దొరువు వద్ద గల బ్రహ్మంగారి గుడి దగ్గర మంగలిమాన్యానికి చెందిన నాగులూరి నరసింహ, నాగులూరి రాజేశ్వరి, దొరువు బజార్కు చెందిన కట్టా దుర్గ, పాతూరుకు చెందిన నాగులూరి దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు నాగులూరి వెంకటేశ్వర్లు, అతని కుమారుడు అంకబాబు వద్ద గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్ల రూపంలోకి మార్చి కనిగిరిలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. బ్రహ్మంగారి గుడి వద్ద బుధవారం సుమారు 1.5 కేజీల గంజాయిని ప్యాకెట్లుగా మారుస్తున్న క్రమంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్లు, అంకబాబు కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించి ఒంగోలు, దరిశి జైలుకు పంపారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అధికారి కనిగిరి సీఐ ఎస్కే ఖాజావలి, కనిగిరి, హెచ్ఎంపాడు ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
నలుగురు నిందితులు అరెస్ట్
వివరాలు వెల్లడించిన కనిగిరి డీఎస్పీ