
అవినీతి షికారు..!
డీఎంహెచ్ఓ కార్యాలయానికి అవినీతి జబ్బు చేసింది. జిల్లా వాసులకు
మెరుగైన వైద్యసేవలందించే విషయంలో కీలక భూమిక పోషించే వైద్య
ఆరోగ్యశాఖ పీకల్లోతు అవినీతిలో
కూరుకుపోయింది. నర్సింగ్ పదోన్నతలు మొదలు డిప్యుటేషన్ల వరకూ పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. జేసీ
నిర్వహించాల్సిన విచారణ వాయిదాలు పడుతుండడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ పనితీరు మారడం లేదు. ఒక అవినీతి మరచిపోక ముందే మరో అవినీతి ఆరోపణలు వచ్చిపడుతున్నాయి. నర్సింగ్ సిబ్బంది పదోన్నతుల సమయంలో ఫోన్ పే ద్వారా మామూళ్లు వసూలు చేయడం సంచలనం సృష్టించింది. అది మరచిపోకుండానే ముఖ హాజరు విషయంలో ట్యాంపరింగ్ కలకలాన్ని సృష్టించింది. తాజాగా నిబంధనలకు వ్యతిరేకంగా ఓ అధికారి డీఎంహెచ్ఓ కార్యాలయంలో తిష్టవేసి వసూళ్లకు పాల్పడం చర్చనీయాంశమైంది.
ఆ మెడికల్ ఆఫీసర్కు ఇక్కడేం పని...
జిల్లా కేంద్రానికి సమీప మండలంలోని ప్రాథమిక వైద్యశాలలో పనిచేస్తున్న ఒక మెడికల్ ఆఫీసర్ గత ఏడాది జూన్ 31వ తేదీ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఓ విభాగానికి ఆఫీసర్గా అదనపు బాధ్యతలను పూర్తిస్థాయిలో తీసుకొని పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది జనవరి 31వ తేదీన ఆయన స్థానంలో వేరే అధికారి బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. అప్పటి వరకు ఇన్చార్జిగా వ్యవహరించిన సదరు మెడికల్ ఆఫీసర్ను పూర్వ స్థానానికి వెళ్లిపోవాలని స్వయంగా డీఎంహెచ్ఓలు వెంకటేశ్వర్లు ఆదేశించినట్లు సమాచారం. ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన మాత్రం విధుల్లో చేరలేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోనే తిష్టవేసినట్లు సమాచారం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో అనధికారికంగా విధులు నిర్వహించిన ఆయన అక్రమంగా వసూళ్లకు తెరదీసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారికి చెందిన కారు డ్రైవర్తో కలిసి ప్రైవేటు వైద్యశాలల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసినట్లు సమాచారం. ఒక్కో వైద్యశాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికే కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబుకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్కు విచారణ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు సాక్ష్యంగా వారు సదరు ఆఫీసర్ హయాంలో జరిగిన ప్రైవేట్ వైద్యశాలల రెన్యువల్స్ను ప్రస్తావిస్తున్నారు. ఆయన హయాంలో జరిగిన ప్రైవేట్ వైద్యశాలల రెన్యువల్స్ను పరిశీలిస్తే సీసీ కెమెరాలలో వాస్తవాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా సదరు మెడికల్ ఆఫీసర్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎఫ్ఆర్ఎస్ వేసినట్లు తెలుస్తుంది.
ప్రైవేట్ కారుకు ప్రభుత్వ డ్రైవర్...
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రైవేట్ కారు వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఓ అధికారి పర్యటనల నిమిత్తం ఓ ప్రైవేట్ వాహనాన్ని కేటాయించుకున్నారు. దీనికి ప్రైవేట్ డ్రైవర్ను ఉపయోగించుకొని అధికారిక పర్యటనలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా ఇద్దరు ప్రభుత్వ డ్రైవర్లను ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై కూడా ప్రజా సంఘాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రైవేట్ వాహనానికి ఎల్లో నెంబర్ ప్లేటు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వైట్ ప్లేటు పెట్టుకొని తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నెల నెల బిల్లులు పెట్టుకుంటున్నట్లు సమాచారం.
వాయిదాల్లో విచారణ..
ఇప్పటికే నర్సింగ్ సిబ్బంది పదోన్నతుల విషయంలో ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నర్సింగ్ స్టాఫ్ సీనియార్టీ లిస్టును మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కానీ ఇంత వరకు విచారణ జరగలేదు. తాజాగా మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంటుందా లేదో తెలియడం లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.
వరుసగా అవినీతి అరోపణలు
తీరు మార్చుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
నిబంధనలకు వ్యతిరేకంగా తిష్టవేసి చక్రం తిప్పుతున్న ఓ అధికారి
ప్రైవేటు కారుకు ప్రభుత్వ డ్రైవర్
అక్రమంగా డిప్యుటేషన్లు...
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమంగా డిప్యుటేషన్లు వేసినట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలోని అనుమలవీడు పీహెచ్సీలో ఆఫీసు సబార్డినేటర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని, ఈతముక్కలపాడు పీహెచ్సీలో ఎంపీహెచ్ఏగా పనిచేస్తున్న ఉద్యోగిని, కొర్రపోలు పీహెచ్సీలో ఫార్మసీస్ట్గా పనిచేస్తున్న వారిని డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యుటేషన్ వేశారు. పుల్లల చెరువు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వైద్యుడిని ఈతముక్కల పీహెచ్సీకి డిప్యూటేషన్ వేశారు. ఇవన్నీ అధికారికంగా డిప్యుటేషన్ వేసినట్లు సమాచారం. అలాగే కొత్తపట్నం పీహెచ్సీలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్, కొమరోలు పీహెచ్సీలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ను సైతం డీఎంహెచ్ఓ కారాలయంలో అనధికారికంగా డిప్యూటేషన్ వేసినట్లు ఆరోపణలు వినిపిసున్నాయి.