అర్ధరాత్రి నగరాన్ని జల్లెడ.. | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నగరాన్ని జల్లెడ..

May 9 2025 1:48 AM | Updated on May 9 2025 1:59 AM

అర్ధరాత్రి నగరాన్ని జల్లెడ..

అర్ధరాత్రి నగరాన్ని జల్లెడ..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

దారుణ హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి పెద్ద కర్మ జరిగిన రోజు రాత్రి ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ పర్యవేక్షణలో నగరంలో పోలీసులు పెద్ద ఎత్తున తనీఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారులపై వెళుతున్న కార్లు, ఆటోలు, మోటారు బైకులను తనిఖీలు చేశారు. నగరంలోని లాడ్జీలు, రెస్టారెంట్లులో అణువణువు గాలింపులు చేపట్టారు. స్క్వాడ్‌ డాగ్‌లను రంగంలోకి దించారు. ఈ తనిఖీలకు వీరయ్య హత్య కేసుకూ ఏమైనా లింకులు ఉన్నాయ్నా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల తనిఖీలు సహజంగా జరిగిదే కదా అంటే ఎస్పీ దామోదర్‌, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నుంచి సీఐలు, ఎస్‌ఐలు అంతా తనిఖీలలో పాల్గొనడం విశేషం. ఏదో జరగబోతుందా అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు పహారా మధ్య వీరయ్య చౌదరి పెద్దకర్మ

గురువారం అమ్మనబ్రోలు గ్రామంలో వీరయ్య చౌదరి పెద్ద కర్మ పోలీసు పహారా మధ్య జరిగింది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150 మంది పోలీసులు, రూరల్‌ సీఐ, ముగ్గురుఎస్సైలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు నిఘా పెట్టారు. వీరయ్య చౌదరి ఇంటి వద్ద నిర్వహించిన పెద్ద కర్మకు టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

కేసు విచారణ కీలక దశకు వచ్చినట్టేనా..?

వీరయ్య చౌదరి హత్య జరిగిన నేటికి 18 రోజులైంది. హత్యకు సంబంధించి పోలీసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే వీరయ్య హత్య కేసులో సూత్రధారులను, పాత్రధారులను దాదాపుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్య కేసులో ప్రధాన పాత్రధారుడిగా అనుమానిస్తున్న అమ్మనబ్రోలుకే చెందిన హవాలా వ్యాపారి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదని సమాచారం. రేపో మాపో కేసును ఫైనల్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

మరికొంత మంది పోలీసులపై చర్యలు?

వీరయ్య హత్య తాలుకా పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిన విషయం తెలిసిందే. హత్యకు ముందు నిందితులు వీరయ్య కార్యాలయం వద్ద రోజుల తరబడి రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. అంతేకాకుండా తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న గుంటూరు రోడ్డులోని ఒక లాడ్జీలో నిందితులు కొద్ది రోజుల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. హత్య చేసిన తరువాత కూడా తాలుకాపోలీసు స్టేషన్‌ మీద నుంచే హంతకులు పరారయ్యారు. అంటే హత్యకు ముందు, హత్య తరువాత కూడా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తొలివేటు తాలుకా సీఐ అజయ్‌ కుమార్‌ మీద వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరయ్య హత్య కేసును ముందుగా పసికట్టలేక పోయిన మరింత మంది పోలీసులను బాధ్యులుగా నిర్ణయించినట్లు సమాచారం. వారి మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చర్చనీయంగా మారిన పోలీసుల రాత్రి తనిఖీలు పోలీసు పహార మధ్య వీరయ్య చౌదరి పెద్దకర్మ వీరయ్య హత్య కేసు రెండు రోజుల్లో ముగింపు ఎస్పీ, డీఎస్పీ, సీఐలు పెద్ద ఎత్తున తనిఖీలు ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించిన పోలీసు విచారణ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement