
రెవెన్యూ సమస్యలపై బాధ్యతాయుతంగా పనిచేయాలి
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశమై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు, ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చిన అర్జీల పరిష్కారం, జిల్లాలో వివిధ ప్రాజెక్ట్లకు సంబంధించిన భూ కేటాయింపుల ప్రతిపాదనలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వస్తున్నాయని, వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్లో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలపై క్షేత్ర స్థాయి ఆడిట్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. అర్జీల పరిష్కారంలో భాగంగా క్షేత్ర స్థాయిలో ఎండార్స్మెంట్ చేసిన వాటి పరిష్కారం చూపిన విధానం సక్రమంగా ఉందా లేదని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలన్నారు. ముఖ్యంగా రీ ఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సక్రమంగా ఎండార్స్మెంట్ చేశారా లేదా అని పరిశీలించాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో నెలకొన్న రెవెన్యూ సమస్యల వివరాలను, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామాల వారీగా నివేదికను వెంటనే సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ కేటాయింపులపై వచ్చిన అర్జీలను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావుతో పాటు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.