
ఫోర్జరీ సంతకంతో బ్యాంక్ లోన్
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 69 ఫిర్యాదులు అందాయి. బాధితులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ ఆయా సమస్యలపై సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, వన్టౌన్ సీఐ నాగరాజు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఒక కమర్షియల్ భవనాన్ని జిమ్ పేరుతో అద్దెకు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ సంతకాలతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకు నుంచి రుణం తీసుకుని మోసం చేశారని ఒంగోలుకు చెందిన బాధితుడు ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేశారు. రుణాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి నోటీసులు అందడంతో అసలు విషయం బయటపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రుణం తీసుకోవడమేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయారు.
● కుటుంబ అవసరాల కోసం ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి తనకు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగిని ష్యూరిటీగా పెట్టి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. రుణం తిరిగి చెల్లించే సమయంలో ఇటీవల మూసేసిన సిండికేట్ బ్యాంకు చెక్కు ఇచ్చి మోసం చేశాడని నగరానికి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు.
టీడీపీకి ఓట్లు వేయలేదని కొడుతున్నారు
అర్థవీడు: టీడీపీకి కాకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేశారంటూ నాలుగు నెలుగా తరచూ గొడవపడుతూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అర్థవీడు మండలంలోని చింతమెల్లెలపాడు గ్రామానికి చెందిన వేశపోగు రవి సోమవారం ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై గతంలో అర్థవీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈనెల 25న టీడీపీ వర్గీయులు కువ్వారపు నాగేంద్ర, మౌనిక, ఆనంద్, సలోమి, వేశపోగు నాగమ్మ, విజయ్, ముసలికాశయ్య మూకుమ్మడిగా తమ ఇళ్లపైకి వచ్చి వేశపోగు కళావతి, జ్వాలా, పెద్ద కాశయ్యపై గొడ్డలితో దాడి చేయగా ఒక్కొక్కరి తలపై 8 నుంచి 10 కుట్లు పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్థవీడు పోలీసులు తమ వద్ద స్టేట్మెంట్ తీసుకుని కంభం ప్రభుత్వ వైద్యశాల నుంచి బలవంతంగా డిశ్చార్జి చేయించారని చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని, పలుమార్లు దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఎస్పీ ఎదుట వాపోయారు.
ఎస్పీ దామోదర్కు బాధితుల ఫిర్యాదు
పోలీస్ గ్రీవెన్స్కు 69 అర్జీలు