
పొగాకు బ్యారన్ దగ్ధం
● రూ. 3 లక్షల మేర ఆస్తినష్టం
కొనకనమిట్ల: మండలంలోని వద్దిమడుగు గ్రామంలో అగ్ని ప్రమాధం సంభవించి పొగాకు బ్యారన్ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అంకిరెడ్డి చెంచమ్మకు చెందిన పొగాకు బ్యారన్ను అదే గ్రామానికి చెందిన ఏరువ తిరుపతయ్య కౌలుకు తీసుకుని పొగాకు క్యూరింగ్ చేపట్టారు. బ్యారన్లో సుమారు 1100 పొగాకు అల్లుడు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మొద్దు గొట్టంపై అల్లుడు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బ్యారన్లోని టైర్లు, రేకులు, అల్లుడు కర్ర కాలిపోయాయి. మంటల ధాటికి బ్యారన్ గోడలు నెర్రలిచ్చాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న మార్కాపురం అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బ్యారన్ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్దమైంది. అల్లుడు కర్ర, బ్యారన్ మొత్తం రూ..3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
నోటికాడికి వచ్చింది బూడిదపాలు..
ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి ఆగమ్యగోచదరంగా ఉంది. ధరలు లేకపోవడంతో నష్టాలు తప్పేలా లేవు. ఈ పరిస్థితుల్లో బ్యారన్ కాలిపోవడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయింది. ప్రభుత్వం, పొగాకు బోర్డు అధికారులు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.