
ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
● ఏపీ టీచర్స్ గిల్డ్ డిమాండ్
ఒంగోలు సిటీ: మూతపడిన ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యర్రగొండపాలెం డీఎంబీసీ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలోని 8 మంది, కొమరోలు నల్లగుంట ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఒకరు, నల్లగుంట ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు, గిద్దలూరు వివేకానంద ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు, గిద్దలూరు ఎస్పీజీ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు, కంభం శ్రీనివాస ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు, దొనకొండ ఇందిరా గాంధీ ఓరియంటల్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు, ఒంగోలు సమావేశం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఒకరు, ఒంగోలు హిందూ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు, మార్కాపురం శారద ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు, మార్కాపురం ఏబీఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు, ఒంగోలు జీ వీఎస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 8 మంది, అర్ధవీడు ఎస్ఎస్ఆర్ఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు, అద్దంకి వేలమూరు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు, పమిడిపాడు ఆది ఆంధ్ర ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఒకరు చొప్పున మొత్తం 49 మంది ఉపాధ్యాయులు మూతపడిన ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్నారని వారికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. వీటితో పాటు అదనంగా ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న ఎయిడెడ్ పాఠశాలల్లోని మిగులు ఉపాధ్యాయులు 205 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలోకి సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు
జూన్లో సామూహిక గృహ ప్రవేశాలు
● జిల్లాలో 8,839 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా జూన్లో 3 లక్షల గృహాలకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన 8,839 ఇళ్ల నిర్మాణాలు మే 31 వ తేదీ నాటికి పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని మునిసిపల్ కమిషనర్లను, ఎంపీడీఓలను, గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు కేవలం 2,824 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేసి 32 శాతం మేర లక్ష్యాన్ని సాధించారన్నారు. ఇంకా 6,015 ఇళ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు అందిస్తున్న 90 రోజుల పని దినాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, మెప్మా పీడీ శ్రీహరి, ఒంగోలు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకువైద్య పరీక్షలు
ఒంగోలు సిటీ: మే నెలలో జరగబోయే ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకోవాలనుకునే ఉపాధ్యాయులకు ఒంగోలు జీజీహెచ్లో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎ.కిరణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు 230 మంది ఉపాధ్యాయులు, రెండోరోజు 116 మంది ఉపాధ్యాయులు హాజరైనట్లు తెలిపారు. 26వ తేదీ చివరి రోజున మిగిలిపోయిన ఉపాధ్యాయులందరూ తప్పక హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. వైద్య పరీక్షలు పూర్తయిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు ఈ నెల 29 వ తేదీ నుంచి ఒంగోలు రిమ్స్లో వ్యక్తిగతంగా వచ్చి పొందాల్సిందిగా తెలిపారు. ఈ వైద్య పరీక్షలను ఒంగోలు డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, ఎంఈఓ కిషోర్బాబు పర్యవేక్షించినట్లు చెప్పారు.