
గడియార స్తంభం తొలగించొద్దు
● కలెక్టర్కు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వినతి
దర్శి(కురిచేడు): దర్శికి తలమానికంగా ఉన్న గడియార స్తంభాన్ని తొలగించవద్దని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గడియార స్తంభాన్ని ఏర్పాటు చేశారని, అప్పటి పంచాయతీ అధికారులు, రోడ్లు భవనాల శాఖాధికారుల అనుమతి తీసుకొని నిర్మించిన ఈ రోడరీ గడియార స్తంభం దర్శికి తలమానికంగా నిలిచిందన్నారు. పాతికేళ్ల గొప్పచరిత్ర కలిగిన గడియార స్తంభాన్ని ఇప్పటికప్పుడు ఆకస్మాత్తుగా తొలగించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అకారణంగా గడియార స్తంభం తొలగిస్తే దర్శి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. గడియార స్తంభాన్భి యధాస్థితిలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మార్కాపురం టౌన్: మానసిక, అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని జగదీశ్వరీ ధియేటర్ రోడ్డు బాలగురవారెడ్డి బజారులో జరిగింది. కాలనీలో నివాసం ఉండే సింగరి కాశీరావు (52) కొంత కాలంగా మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
మార్కాపురం: రథోత్సవం సందర్భంగా స్వామిని చూసేందుకు వచ్చిన మహిళ మెడలో గొలుసు చోరీకి గురైంది. ఈ మేరకు పట్టణ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే..మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన కాళంగి బాలరాజు భార్య కాళంగి వెంకట పిచ్చమ్మ చెన్నకేశవస్వామి వారి రథోత్సవాన్ని తిలకించేందుకు రథం వద్దకు వచ్చి టెంకాయ కొట్టి బయటకు వచ్చి చూసుకోగా మెడలో మూడు తులాల గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాలపై లాఠీచార్జి
గిద్దలూరు రూరల్: పట్టణంలోని అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్న ధన్రాజ్, రాముడు ఇరువర్గాలకు చెందిన వారు గత రెండు రోజుల క్రితం ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. గాయాలపాలై గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ కె.సురేష్ సిబ్బందితో లాఠీచార్జి చేసి ఘర్షణను అదుపులోకి తీసుకువచ్చారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.