
రెచ్చిపోయిన దొంగలు
బేస్తవారిపేట: ఇంటి యజమానులు ఆరుబయట నిద్రిస్తుండగా దొంగలు చేతివాటం చూపించారు. వరుసగా ఉన్న ముగ్గురు అన్నదమ్ముళ్ల గృహాల్లో 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.65 వేల నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచిన యజమానులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల కథనం మేరకు.. పీవీ పురంలో అన్నదమ్ముళ్లు తమటం గురునారాయణరెడ్డి, తమటం జగన్మోహన్రెడ్డి, తమటం చిన్నవెంకరెడ్డి గృహాలు వరుసగా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ గురువారం రాత్రి ఆరుబయట, వరండాలో నిద్రపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ గృహం వెనుక వైపు తలుపు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో వరుసగా ఉన్న మూడు ఇళ్లను లూటీ చేశారు. షెల్ఫ్ల్లో దుస్తుల కింద దాచిపెట్టిన బీరువా తాళాలు తీసుకుని చోరీకి పాల్పడ్డారు. తమటం గురునారాయణరెడ్డి గృహంలో 13 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, జగన్మోహన్రెడ్డి ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, చిన్న వెంకటరెడ్డి ఇంట్లో బంగారు ఉంగరం, రూ.5 వేల నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, కంభం సీఐ కె.మల్లికార్జున, ఎస్సై రవీంద్రారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు క్లూస్ టీమ్ ఎస్సై శరత్కుమార్ వేలిముద్రలు సేకరించారు. పోలీస్ జాగిలాలు గృహాల వెనుక వైపున పొలాలు, పాఠశాల వద్దకు, గృహ పరిసరాల్లో తిరిగాయి. ఆ ఇళ్లపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు.
వీరాయపాలెంలో నిద్రిస్తున్న మహిళల మెడలో..
దర్శి(కురిచేడు): దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెం గ్రామంలో గురువారం అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేశారు. పంచల్లో పడుకున్న మహిళల మెడల్లో నాలుగున్నర సవర్ల బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. వివరాలు.. తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ముప్పరాజు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఇంటి వరండాలో నిద్రిస్తున్నారు. ఇద్దరు దొంగలు రాత్రి 12.30 గంటల సమయంలో ఇంట్లోకి గోడదూకి ప్రవేశించారు. నాగేశ్వరరావు భార్య పద్మ మెడలో బంగారు తాళిబొట్టు, నానుతాడు కట్ చేశారు. అయితే తాళిబొట్టు కిందపడటంతో పద్మకు మెళకువ వచ్చింది. లేచి చూసే సరికి దొంగలు తాడు తీసుకుని పరారయ్యారు. నాగేశ్వరరావు వెంటపడినా ఫలితం లేకపోయింది. అదే గ్రామంలో రాత్రి ఒంటి గంట తరువాత మధుమంచి ఏడుకొండలు కుటుంబ సభ్యులు వారి ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్నారు. ఏడుకొండలు భార్య గురువర్దిని మెడలోని తాళిబొట్టు, నానుతాడు లాక్కుని పరారవుతుండగా ఏడుకొండలు వెంటపడ్డాడు. దొంగలు పొలాల్లో గుండా పారిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
బేస్తవారిపేట మండలం పీవీ పురంలో ముగ్గురు సోదరుల గృహాల్లో దొంగతనం
23 తులాల బంగారు ఆభరణాలు, రూ.65 వేల నగదు అపహరణ
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన
డీఎస్పీ, సీఐ
కురిచేడు మండలం తూర్పువీరాయపాలెంలో మహిళ మెడలో గొలుసు చోరీ

రెచ్చిపోయిన దొంగలు