
ఉర్దూ బోధనకు ఉరి!
కంభం:
ప్రస్తుతం నిర్వహిస్తున్న టీచర్ల బదిలీలు ఉర్దూ మీడియం విద్యకు మైనారిటీ విద్యార్థులను దూరం చేసేలా ఉన్నాయని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల్లో భాగంగా 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉన్న ఉపాధ్యాయులు కచ్చితంగా మరో చోటకు వెళ్లిపోవాల్సి ఉంది. ఆ పాఠశాలల్లో తిరిగి ఉపాధ్యాయులను నియమిస్తే అక్కడ చదువుకునే ఉర్దూ మీడియం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత బదిలీల నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీలను పీహెచ్(ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్) కోటా కింద భర్తీ చేయాల్సి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు మాత్రమే సీహెచ్ ఉపాద్యాయులుండగా జిల్లాలో 8 పాఠశాలలను పీహెచ్ కోటాకు కేటాయించారు. పీహెచ్ కోటా ఉపాధ్యాయులు ఉన్న చోటే యథావిధిగా కొనసాగవచ్చని ఇప్పటికే కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో వారు తమ స్థానాల్లోనే కొనసాగితే ఖాళీ అవనున్న ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరని తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం స్పందించడం లేదు.
పీహెచ్ కోటా పాఠశాలలివే..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం మండల కేంద్రం అర్బన్కాలనీ ఉర్థూ పాఠశాల, లింగోజిపల్లి ప్రాథమిక పాఠశాల, చీమకుర్తి ప్రాథమిక పాఠశాల, కందుకూరులోని సరూర్ నగర్ ప్రాథమిక పాఠశాల, పొదిలిలోని ప్రాథమిక పాఠశాల, సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు, కొమ్మలపాడు ప్రాథమిక పాఠశాలలు, యర్రగొండపాలెం ప్రాథమిక పాఠశాలలు పీహెచ్ కోటా కిందకు వచ్చాయి. ఇక్కడ పనిచేసే ఉర్దూ ఉపాద్యాయులు లాంగ్ స్టాండింగ్ కావడంతో వారు వెళ్లిపోనున్నారు. జిల్లాలో పీహెచ్ ఉపాద్యాయుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో అక్కడ చదువుకునే ఉర్దూ మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరగనుంది.
హైస్కూళ్లుగా అప్గ్రేడ్ కానున్న
యూపీ స్కూళ్లు
ఉర్దూ యూపీ స్కూళ్లలో 6, 7, 8వ తరగతుల్లో 30 మందికన్నా ఎక్కువగా విద్యార్థులుంటే వాటిని హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైపాలెం, ఏల్చూరు, కొమ్మలపాడు, కందుకూరు, ఖాజీపాలెం, వలపర్ల యూపీ స్కూళ్లు ఈ విద్యా సంవత్సరం నుంచి హైస్కూళ్లుగా మారనున్నాయి. ఈ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో ఉర్థూ మీడియం పాఠశాలల వివరాలు
ఉర్దూ విద్యార్థులకు అన్యాయం చేసేలా టీచర్ల బదిలీల ప్రక్రియ
నిబంధనల ప్రకారం పీహెచ్ కోటా
కింద 40 శాతం బదిలీలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పీహెచ్సీ
కింద 8 పాఠశాలలు
అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు ముగ్గురు మాత్రమే..
ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఇబ్బంది
లేకుండా చూడాలని తల్లిదండ్రుల వినతి
ఖాళీల వివరాలు
పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలి
నా ఇద్దరు పిల్లలను ఉర్దూ మీడియంలో చదివిస్తున్నా. తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉర్దూ బోధించలేరు. కాబట్టి ఉర్దూ పాఠశాలల్లో ఉర్దూ బోధించేవారినే నియమించాలి. లేదంటే పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– పఠాన్ రుక్సానా, విద్యార్థి తల్లి
ఉన్నతాధికారుల దృష్టికి సమస్య
జిల్లాలో ఉర్దూ పాఠశాలల్లో ఉన్న ఖాళీల వివరాలు, ఉర్దూ పాఠశాలల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
– మొయినుద్దీన్, జిల్లా ఉర్దూ డీఐ

ఉర్దూ బోధనకు ఉరి!

ఉర్దూ బోధనకు ఉరి!