
దర్శి: ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి దర్శి మండలంలోని తూర్పు వెంకటాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై మురళి కథనం మేరకు.. మండలంలోని తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన గుంటూరు వీరబ్రహ్మాచారి(60) దర్శిలో కార్పెంటర్గా పనిచేస్తుంటారు. రోజులాగే ఆదివారం తన పని ముగించుకుని ఎర్ర ఓబనపల్లి అగ్నిపురి కాలనీకి చెందిన గుంటూరు పెద్దన్న ఆటోలో ఎక్కారు. డ్రైవర్కు ఎడమ వైపు కూర్చుని గ్రామానికి బయలుదేరారు. గ్రామ శివారులోని మూలమలుపులో చప్టా వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వీరబ్రహ్మాచారి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.