
ఉరకలెత్తించిన ఒంగోలు గిత్తలు
● ముగిసిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
కొనకనమిట్ల: వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెలుగొండ క్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సీనియర్ విభాగంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఆదివారం ఉత్సాహంగా ముగిశాయి. ఒంగోలు గిత్తలు రంకెలేస్తూ ప్రజలను ఉత్సాహపరిచాయి. మేకలవారిపల్లి రెడ్ల సంఘం పర్యవేక్షణలో నిర్వహించిన ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. సేద్యపు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రకాశం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, బాపట్ల జిల్లాల నుంచి ఎనిమిది జతల ఎడ్లు పోటీలో తలపడ్డాయి.
సత్తాచాటిన వైఎస్సార్ కడప జిల్లా ఎడ్లు..
సీనియర్ విభాగంలో నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పందేల్లో వైఎస్సార్ కడప జిల్లా ఎడ్లు తమ సత్తాచాటాయి. కడప జిల్లా చౌటపల్లికి చెందిన మార్తాల చంద్రోబులరెడ్డి ఎడ్లజత నిర్ణీత 20 నిముషాల్లో 3759 అడుగులు లాగి మొదటి బహుమతి సాధించుకున్నాయి. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం రాంభూపాల్రెడ్డి ఎడ్ల జత 3743 అడుగులు లాగి రెండో స్థానంలో నిలిచాయి. బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన ఆర్కే బుల్స్ శిరీషా చౌదరి ఎడ్ల జత 3644 అడుగులు లాగి మూడో స్థానంలో సాధించాయి. బాపట్ల జిల్లా పీవీఎస్ఆర్ బుల్స్ వీరాస్వామిచౌదరి 3755 ఎడ్ల జత 2756 అడుగులు లాగి నాలుగో స్థానంలో, నంద్యాల జిల్లా జిల్లెల్ల గ్రామం నాగిరెడ్డి ఎడ్ల జత 3302 అడుగులు లాగి ఐదో స్థానంలో, ప్రకాశం జిల్లా వీరాయపాలేనికి చెందిన పెద్దచాంద్ ఎడ్లజత 3272 అడుగులు లాగా ఆరో స్థానంలో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ఆలయ ఆవరణలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, ఆలయ ఈఓ చెన్నకేశవ రెడ్డి, దాతల సహకారంతో అందజేసిన నగదును వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు బహుమతులను రూ.80, రూ.60, రూ.40, రూ.20, రూ.15, రూ.10 వేలు అందజేశారు.