
బాబు మాటలతో జనం మోసపోయారు
దర్శి: గత ఎన్నికల్లో చంద్రబాబు మోసపు మాటలు విని రాష్ట్ర ప్రజలు దారుణంగా మోసపోయారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆయనతో పాటు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. ముందుగా ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఎమ్మెల్యేను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
మళ్లీ జగన్ సీఎం అవడం ఖాయం:
విద్యుత్ ప్రభపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా వచ్చిన కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది నెలల క్రితం తన గెలుపు కోసం కృషి చేసి ఎన్నికల్లో ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ అంటే ప్రతి ఒక్కరికీ గుండె నిండా ధైర్యం, మనస్సు నిండా ప్రేమ ఉందన్నారు. జగన్న పాలన ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేనా ఉందన్నారు. గత ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసుకోలేకపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఈ సారి ఎన్ని కూటములు ఎదురైనా జగనన్న సీఎం అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. జగనన్నకు అబద్ధం చెప్పడం చేతకాదన్నారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెప్పి, మోసపూరిత హామీలు ఇచ్చి సీఎం అయ్యి ప్రజలను మళ్లీ దారుణంగా మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని ఓట్లు అడిగేందుకు వెళ్తే చెప్పులు, చీపుర్లతో కొడతారని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మరొక వ్యక్తి నేను ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని అన్నారని, ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రశ్నిస్తానన్న ఆయన ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
గిట్టుబాటు ధరలు అందక రైతుల ఇక్కట్లు:
జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. జగనన్న హయాంలో క్వింటా మిరప ధర రూ.30 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.10 వేలు కూడా లేదన్నారు. ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు రైతులను నిలువునా మోసగించారన్నారు. వ్యవసాయంలో నష్టాలు వచ్చి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని చెప్పి యువతను దారుణంగా మోసం చేశారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, దొనకొండ మాజీ మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్రెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, నాయకులు కర్ణా భాస్కర్రెడ్డి, కుందురు నరశింహారెడ్డి, కేసరి ప్రసాద్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ అమలు చేయలేదు మహిళలను మోసం చేస్తే చీపుర్లు, చెప్పులతో కొడతారు మరొక వ్యక్తి ఎన్నికల ముందు ప్రశ్నిస్తా అని కనిపించకుండా పోయాడు ధ్వజమెత్తిన దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

బాబు మాటలతో జనం మోసపోయారు