ఒంగోలు సిటీ: వెనుకబడిన జిల్లాగా గుర్తించబడిన ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి పది వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఆ మేరకు సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జీ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాట్లాడుతూ దశాబ్దకాలం అనేక ఉద్యమాలు, జైలుశిక్షల ఫలితంగా వెనుకబడిన జిల్లాగా కేంద్రం ప్రకటించినప్పటికీ జిల్లా వెనుకబాటుతనాన్ని రూపుమాపే దిశగా నిధులు కేటాయించలేదన్నారు. పాలకవర్గాలు సైతం జిల్లా అభివృద్ధిని విస్మరించారని పలువురు వక్తలు దుయ్యబట్టారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే నిధులు కేటాయించాలని, దామాషా ప్రకారం నిధులు రాబట్టేందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, విస్మరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో గ్రానైట్, ఆక్వా, పొగాకు వంటి వనరుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం జమవుతుందన్నారు. జిల్లా ప్రజానీకానికి చెందిన ఈ సంపదలో జిల్లా వాటాగా రూ.10 వేల కోట్లు ఒకే విడత అందిస్తే వెలిగొండ, సంగమేశ్వరం, పాలేటిపాడు, గుండ్లకమ్మ వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటు తాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందని అన్నారు. దీంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అన్నిరకాలుగా ప్రగతి సాధిస్తుందన్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన ప్రకాశం జిల్లా బీపీ, షుగర్ వంటి వ్యాధుల్లో మాత్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఉపాధి అవకాశాలు కరువై మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రజలు వ్యాధుల బారిన పడటమే అందుకు కారణమని విశ్లేషించారు. సాగునీటి వనరులు లేక వ్యవసాయం అభివృద్ధి చెందక ఉపాధి అవకాశాలు కరువై ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ రూ.లక్ష కోట్ల అప్పులతో రూపొందించటం ప్రజలను అప్పుల్లోకి నెట్టే చర్యగా విమర్శించారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రం రూ.46 వేల కోట్ల అప్పు చేయడం ప్రజలకు మరో భారంగా పరిణమిస్తోందన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.లక్ష కోట్ల గ్రాంట్ కోసం ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సీపీఎం నిర్వహంచిన ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు చైతన్యవంతులై ఉద్యమం చేపడతారని హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం సీనియర్ నాయకుడు పెంట్యాల హనుమంతరావు, జిల్లా కమిటీ సభ్యులు పి.వెంకటరావు, కేజీ మస్తాన్, కంకణాల రమాదేవి, పెంట్యాల కల్పన, జుజ్జూరు జయంతిబాబు, కాలం సుబ్బారావు, వి.బాలకోటయ్య, బంకా సుబ్బారావు, వెల్లంపల్లి ఆంజనేయులు, టంగుటూరు రాము, ఉబ్బ ఆదిలక్ష్మి, పల్లాపల్లి ఆంజనేయులు, కిలారి పెద్దబ్బాయి, టి.శ్రీకాంత్, ఎస్.స్వామిరెడ్డి, నెరుసుల వెంకటేశ్వర్లు, వి.మోజస్, తంబి శ్రీనివాసులు, టి.మహేష్, కేఎఫ్ బాబు, ఎస్డీ హుస్సేన్, కంకణాల వెంకటేశ్వర్లు, ఎస్కే అమీర్, ఉబ్బ వెంకటేశ్వర్లు, దామా శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజా సమస్యలు పరిష్కరించండి సీపీఎం ధర్నాలో పలువురు వక్తలు