కొనకనమిట్ల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల జయజయ ధ్వానాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీవారికి రోజుకొక అవతారంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం శ్రీవారు పల్లకిలో అలంకరించిన శేష వాహనంపై శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన శ్రీవారికి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మేళతాళాలతో వెలుగొండ పురవీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవ ఉభయదాతలుగా మారెళ్ల నాగ వెంకట దిలీప్కుమార్, తిరుపతిరావు, వెంకట సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు స్వామివారికి అర్చనలు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గురువారం శ్రీవారు హనుమంత వాహనంపై శ్రీవారి ఉత్సవం జరుగుతుందని ఆలయ ఈఓ చెన్నకేశవరెడ్డి తెలిపారు.
శేష వాహనంపై శ్రీవారు