
మాట్లాడుతున్న మంత్రి సురేష్, పక్కన ఎమ్మెల్యే కేపీ, తదితరులు
● మంత్రి ఆదిమూలపు సురేష్
మార్కాపురం: రాష్ట్రంలో మెరుగైన పారిశుధ్యానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఇంటి వద్ద నుంచే తడి చెత్త, పొడి చెత్తను మున్సిపల్ కార్మికులు సేకరిస్తున్నారని చెప్పారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లను పరిశీలించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మార్కాపురం పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ సేథుమాధవన్, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి రీడింగ్రూం సెంటర్ నుంచి అమ్మవారిశాల, తేరుబజారు, నాయుడువీధి వరకూ అన్ని వీధులను పారిశుధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. అనంతరం నిర్వహించిన సభకు మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సురేష్ మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో అదనంగా 30 డస్ట్బిన్లు ఇస్తామన్నారు. ఇంకా క్లీన్ మార్కాపూర్, గ్రీన్ మార్కాపూర్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎండీ గంధం చంద్రుడు మాట్లాడుతూ వేకువజాము నుంచి రాత్రి వరకూ పారిశుధ్యం విషయంలో సేవలందిస్తున్న కార్మికులను ప్రతిఒక్కరూ గౌరవించాలని కోరారు. మార్కాపురం మున్సిపాలిటీకి 21 ఈ–ఆటోలు ఇచ్చామన్నారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే జీతాలు పెంచారని గుర్తుచేశారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించాలని, చిన్నచూపు చూడవద్దని కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజర్ కిరణ్కుమార్, మెప్మా పీడీ రవికుమార్, డీపీవో నారాయణరెడ్డి, కమిషనర్ గిరికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్లు షేక్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు కొత్త కృష్ణ, సిరాజ్, దొడ్డా భాగ్యలక్ష్మి, డీ హర్షిత, కరీమ్బాషా, రామకృష్ణారెడ్డి, బండారు శ్రీను, సాధనా కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ రాజగోపాల్రెడ్డి, రమేష్బాబు, కోఆప్షన్ సభ్యులు మయూరి ఖాశీం తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో విశిష్ట సేవలందించిన పారిశుధ్య కార్మికులను మంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఘనంగా సన్మానించారు. ర్యాలీకి వచ్చిన సాధనా కళాశాల విద్యార్థులు, ప్రజలు, డ్వాక్రా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.