భావి శాస్త్రవేత్తలకు సువర్ణ వేదిక | - | Sakshi
Sakshi News home page

భావి శాస్త్రవేత్తలకు సువర్ణ వేదిక

Oct 2 2023 2:16 AM | Updated on Oct 2 2023 2:16 AM

30వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో విజేతలకు బహుమతులిస్తున్న మంత్రి రోజా (ఫైల్‌ ఫొటో)   - Sakshi

30వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో విజేతలకు బహుమతులిస్తున్న మంత్రి రోజా (ఫైల్‌ ఫొటో)

ఒంగోలు: చిన్నతనం నుంచే ఏదో ఒకటి సాధించాలనే తపనున్న చిన్నారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి వారిని భావిశాస్త్రవేత్తలుగా మరల్చేందుకు జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రతి ఏటా నిర్వహిస్తున్న పోటీలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించనుండగా, ఈ నెలాఖరున జిల్లాలో జిల్లాస్థాయి ప్రాజెక్టుల ప్రదర్శన జరగనుంది. అందులో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపుతారు. ఎటువంటి ప్రాజెక్టులు రూపొందించాలనే దానిపై ప్రతి ఏటా ఒక నేపథ్యాన్ని విద్యార్థుల ముందు ఉంచుతారు. దానికి అనుగుణంగా ఉన్న ప్రాజెక్టులను మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.

ఈ ఏడాది నేపథ్యం ఇదీ...

ఏపీ రాష్ట్ర సాంకేతిక మండలి (ఆప్‌కాస్ట్‌), 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లు ఈ ఏడాది ప్రాజెక్టుల ప్రదర్శనకు సంబంధించి సామాజిక వికాసానికి దోహదపడే ఆరోగ్య, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అనే అంశాన్ని ఎంపిక చేశారు. సబ్‌ థీమ్‌గా ఆవరణ వ్యవస్థలపై, ఆరోగ్యంపై పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సామాజిక, సాంస్కృతిక పద్ధతులపై పర్యావరణ వ్యవస్థ, ఆధారిత విధానంపై పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం వైవిధ్య సాంకేతిక పద్ధతులపై ప్రాజెక్టులు రూపొందించవచ్చు. వీటిని ముందుగా జిల్లాస్థాయిలో సమర్పించాలి. పూర్తి వివరాలకు ఆప్‌కాస్ట్‌ జిల్లా కో ఆర్టినేటర్‌ టి.రమేష్‌ను సంప్రదించాలి.

ప్రాజెక్టు ఎలా ఉండాలంటే..?

జిల్లా బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శించే ప్రాజెక్టులు సైన్స్‌ సూత్రాలను ప్రదర్శించే సూత్రాల నమూనాగా ఉండాలి. విద్యార్థులు ప్రదర్శించే ప్రాజెక్టులు ప్రధాన అంశానికి లేదా ఉప అంశానికి లోబడే ఉండాలి. ప్రాజెక్టు ద్వారా సమస్యకు నిర్దిష్ట కాలంలో పరిష్కారాన్ని కనుగొనలేకపోయినప్పటికీ అధ్యయన పద్ధతి మాత్రం శాసీ్త్రయంగా ఉండాలి. సమస్య అవగాహన, సృజనాత్మకత, నూతనత్వానికి ప్రాధాన్యత తప్పనిసరి. ఇద్దరు విద్యార్థులు ఒక టీమ్‌గా ఏర్పడి ప్రాజెక్టు నిర్వహించాలి. చక్కని శీర్షిక, సంబంధిత నిర్దేశిత భౌగోళిక ప్రాంత పరిధిలో ప్రాజెక్టు నిర్వహించాలి. పరిశీలనలను తేదీల వారీగా లాగ్‌బుక్‌లో నమోదు చేయాలి. దత్తాంశాలన్నింటినీ విశ్లేషించాలి. పరిశోధనల ఫలితాన్ని వివరించి వ్యాఖ్యానించాలి. సమస్యకు పరిష్కారాన్ని సూచించాలి. ప్రాజెక్టు మొత్తాన్ని రిపోర్టు రూపంలో డాక్యుమెంట్‌గా రూపొందించి పోటీల్లో సమర్పించాలి. 250 పదాలకు మించకుండా ప్రాజెక్టు గురించి సంక్షిప్తంగా వివరించాలి.

పోటీలకు అర్హులు వీరే...

జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అన్ని యాజమాన్యాల పరిధిలో 6 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అర్హులు. పాఠశాలలకు వెళ్లేవారితో పాటు బడిమానేసిన వారు కూడా ఇందులో పాల్గొనవచ్చు. అయితే, ప్రాజెక్టులు ప్రదర్శించే విద్యార్థుల వయసు 10 నుంచి 17 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. జిల్లాస్థాయి ప్రదర్శనకు 10 నుంచి 17 ఏళ్లలోపు వారందరినీ ఆహ్వానిస్తారు. రాష్ట్రస్థాయిలో 10 నుంచి 14 ఏళ్లలోపు వారిని జూనియర్లుగా, 14 నుంచి 17 ఏళ్లలోపు వారిని సీనియర్లుగా పరిగణిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, సృజనాత్మకతను ప్రోత్సహించి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలు సిద్ధం చేయించాలన్నదే జిల్లా సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శనల ముఖ్య లక్ష్యం.

సైన్స్‌ టీచర్లు మార్గదర్శకత్వం వహించాలి

ప్రతి పాఠశాల నుంచి కనీసం రెండు నుంచి మూడు ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి. ప్రాజెక్టులు రూపొందించే విద్యార్థులకు సైన్స్‌ టీచర్లు గైడ్‌గా వ్యవహరిస్తారు. ప్రాజెక్టులకు సంబంఽధించి పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ 9666955504ను సంప్రదించవచ్చు.

– టి.రమేష్‌, ఆప్‌కాస్ట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌

ప్రతి పాఠశాల నుంచి ప్రాతినిధ్యం

ఉండాలి

జిల్లాలో ఉన్న అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు విద్యార్థులను సన్నద్ధం చేయడంపై పాఠశాలల హెడ్మాస్టర్లు, సైన్స్‌ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

– వీఎస్‌ సుబ్బారావు, డీఈవో

చిన్ననాటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాజెక్టుల ప్రదర్శనకు అవకాశం

10 నుంచి 17 సంవత్సరాల్లోపు వారు అర్హులు

ఈ నెలాఖరున జిల్లాస్థాయి సైన్స్‌ ప్రాజెక్టుల ప్రదర్శన

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement