
మాతాశిశు వైద్యశాలను పరిశీలిస్తున్న జాయింట్ కమిషనర్ సరళమ్మ
ఒంగోలు టౌన్: పెద్దారవీడు ఎస్సైగా టి.రాజ్కుమార్ను నియమిస్తూ ఎస్పీ మలికాగర్గ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజ్కుమార్ ఒంగోలు సీసీఎస్లో విధులు నిర్వ హిస్తూ తాలుకా ఎస్ఐగా అటాచ్లో ఉన్నారు.
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
త్రిపురాంతకం: ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. త్రిపురాంతకంలోని శ్రీబాలా త్రిపురసుందరీ దేవి ఏజన్సీస్ తనిఖీ చేసి రూ.1.28 లక్షల విలువైన విత్తనాల అమ్మకాలు నిలుపుదల చేశారు. కిసాన్ అగ్రిమాల్ తనిఖీ చేసి రూ.2.51 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలను విజిలెన్స్ ఏఓలు సంగమేశ్వరరెడ్డి, కే వెంకటరెడ్డి, కే నీరజ, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఎస్జీఎఫ్ అండర్–19 జట్ల ఎంపిక
ఒంగోలు సెంట్రల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)లో అండర్–19లో విద్యార్థులకు పలు పోటీల్లో ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఆదినారాయణ తెలిపారు. ఒంగోలు ఏబీఎం జూనియర్ కాలేజి గ్రౌండ్లో బుధవారం ఉదయం పది గంటలకు జిమ్నాస్టిక్స్, యోగా సెలక్షన్ నిర్వహిస్తారని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఫుట్బాల్ ఆటలో ఎంపికలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పదో తరగతి జెరాక్స్ మార్క్స్లిస్ట్పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకంతో ఫిజికల్ డైరెక్టర్ కే డేవిడ్రాజుకు విద్యార్థులు వివరాలు సమర్పించాలని ఎస్జీఎఫ్ సెక్రటరీ ఆదినారాయణ వివరించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9949722791ను సంప్రదించాలని కోరారు.
వైద్యశాలను పరిశీలించిన జాయింట్ కమిషనర్
ఒంగోలు అర్బన్: మాతాశిశు వైద్యశాలను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సరళమ్మ మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఆస్పత్రిలోని లేబర్ వార్డు పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్, మ్యాటీ వార్డు, ఇతర వార్డులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న అదనపు బ్లాక్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
ఘనంగా బధిరుల దినోత్సవం
ఒంగోలు అర్బన్: స్పందన భవనంలో మంగళవారం బధిరుల, సంకేత దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో జేసీ మాట్లాడుతూ బధిరుల ప్రాముఖ్యతను గుర్తించి వారికి అవసరమైన విద్య, సంరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుని కమ్యూనికేషన్ సాధనంగా సాంకేతికతపై పూర్తి తర్ఫీదునివ్వాలన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన మాట్లాడుతూ బధిరుల సంఘ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలతో మమేకం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. గడిచిన నాలుగేళ్లలో వారికోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. బధిరులు పూర్తి స్వతంత్య్రంతో జీవించేలా ప్రోత్సహిస్తూ, వారి హక్కులు బధిరుల పాఠశాల ద్వారా తెలియజేస్తున్నామన్నారు. దీనిలో బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ టీ వెంకటేశ్వర్లు, బధిరుల విద్యార్థులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

త్రిపురాంతకంలో ఎరువుల దుకాణాలు తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు