
పైలెట్ ప్రాజెక్ట్ కింద మోడల్ హెల్త్ క్యాంపులో రోగులను పరీక్షిస్తున్న వైద్యురాలు
ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల్లోని ప్రజల చెంతకే వైద్యసేవలను చేరువ చేస్తోంది. అందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ఇంటింటి సర్వే..ప్రత్యేక హెల్త్ క్యాంపులకు శ్రీకారం చుట్టింది. వైద్యం అవసరమైన వారికి నిపుణులైన వైద్యులు ఉచితంగా వైద్యపరీక్షలు చేయడంతో పాటు మందులు అందించనున్నారు. జిల్లాలో 15 నుంచి ప్రారంభమైన ఇంటింటి సర్వే దాదాపు పూర్తికావచ్చింది. ప్రజల ఆరోగ్య నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. 30వ తేదీ నుంచి ప్రత్యేక హెల్త్ క్యాంపులతో స్పెషలిస్టు వైద్యులతో మెరుగైన వైద్యసేవలు అందించనున్నారు.
ఒంగోలు అర్బన్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేసి అందించేలా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరికీ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నాడు–నేడు కార్యక్రమం ద్వారా అత్యాధునికంగా మార్పు చేశారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకుపోయారు. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కొత్త అధ్యాయానికి తెరతీశారు. దీని ద్వారా ప్రతి ఇంటికీ వైద్య సేవలు అందనున్నాయి. దీంతో ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నారు.
ప్రతి కుటుంబ ఆరోగ్య అవసరాలను గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15 నుంచి ఇంటింటికీ వలంటీర్లు వెళ్లి గృహస్తుల ఆరోగ్య అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ఎంఎల్హెచ్పీలు ఆయా ఇళ్లకు వెళ్లి ఆరోగ్య సమస్యలపై సమగ్రమైన సమాచారం సేకరించారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. రోగులకు చికిత్స ఆవశ్యకత ఉంటే వెంటనే నియోజకవర్గ, జిల్లా స్థాయి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. విలేజ్హెల్త్ క్లినిక్ల పరిధిలో తప్పనిసరిగా మందులు సిద్ధం చేసుకుని అవసరమైన మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక హెల్త్ క్యాంపులు:
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30 నుంచి మండలాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. హెల్త్ క్యాంపులు ప్రారంభించే ముందుగానే ప్రజల ఆరోగ్య నివేదికలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. రోగిపేరు నమోదు చేయగానే మొత్తం సమాచారం తెలిసిపోతుంది. ప్రతి శిబిరంలో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. విలేజ్హెల్త్ క్లినిక్ల పరిధిలో గుర్తించిన రోగులందరికీ క్యాంపు నిర్వహించిన రోజు వైద్య సేవలు అందిస్తారు. ప్రజలకు అనువైన ప్రాంతాల్లో ఈ శిబిరం ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయాధికారి, సమన్వయ కమిటీలో గ్రామ, వార్డు సచివాలయాలు, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ బాధ్యత వహిస్తారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, పీహెచ్సీ వైద్యులు, సీడీపీవోలు, ఎంఈఓలకు కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వైద్య శిబిరం నిర్వహించే వైద్యశిబిరాలకు మౌలిక సదుపాయాలు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అన్నీ గ్రామాల్లో శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ:
వైద్య శిబిరాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మధుమేహం, క్యాన్సర్, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి, గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తారు. బాలింతలు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వైద్య శిబిరాలకు ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి కూడా స్పెషలిస్టు వైద్యులు సేవలందించేలా చర్యలు తీసుకుంటారు.
వైద్య సేవలు, మందులు ఉచితం
వైద్య పరీక్షల అనంతరం రోగులకు పంపిణీ చేసేందుకు అన్నీ రకాల మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు ప్రారంభించారు. అధునాతన వైద్య పరికరాలతో వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ శిబిరాల్లో వైద్య పరీక్షలు, వైద్య సేవలు, మందులు అన్నీ ఉచితంగానే ప్రజలకు అందజేస్తారు.
ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఇంటింటి సర్వే 30వ తేదీ నుంచి ప్రత్యేక హెల్త్ క్యాంపులు జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు చేరువగా వైద్య సేవలు క్యాంపుల్లో ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటు స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందజేత