
కాపునేస్తం చెక్కు అందజేస్తున్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు
ఒంగోలు అర్బన్:
పేద కుటుంబాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని దానిలో భాగంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కూడా మహిళల అభ్యున్నతికి ఉపకరిస్తుందని జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు అన్నారు. వరుసగా నాల్గవ ఏడాది అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో శనివారం నగదు జమ చేసే కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లింగంగుంట్ల రవిబాబు, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు అతిథులు బ్యాంకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.15 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పథకం ద్వారా 8,707 మంది లబ్ధిదారులకు రూ.13.06 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ ఈ నగదును మెరుగైన జీవనోపాధి కోసం వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
నగర మేయర్ మాట్లాడుతూ కాపుల సంక్షేమ కోసం ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలుగా చేయూతనిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఒడా చైర్పర్సన్ మీనాకుమారి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పేద కుటుంబాల్లో మహిళల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. కాపులను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేస్తున్న ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
వైఎస్ఆర్ కాపునేస్తం 4వ విడత కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు జిల్లాలో 8,707 మంది లబ్ధిదారులకు రూ.13.6 కోట్లు జమ