నారా వెన్నుపోటులో నారీమణి ఎవరు?
బాబు ఇంట్లో మహిళలపై మేం పుస్తకాలను ప్రచురించలేమా?.. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
మహారాణిపేట(విశాఖ దక్షిణ): సీఎం జగన్ మూడున్నరేళ్లలోనే 98 శాతానికి పైగా ఎన్నికల హామీలను అమలు చేయడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బృందానికి దిక్కు తోచక రాజకీయాల్లో లేని మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి మహిళల జోలికొస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించారు.
స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనకు సంబంధించి సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ టీడీపీ పుస్తకం ప్రచురించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అదే తరహాలో చంద్రబాబు ఇంట్లో మహిళల గురించి తాము పుస్తకాలను ప్రచురించలేమా? అని ప్రశ్నించారు.
టీడీపీని, పదవిని, పార్టీ ఆస్తులన్నింటినీ లాక్కుని ఎన్టీఆర్ మరణానికి కారకుడైన నారావారి నారీమణి ఎవరు..? ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుకు కత్తి అందించిన నారీమణి ఎవరని తాము పుస్తకాలు ముద్రించలేమా? అని అన్నారు. లోకేశ్ యువగళం ఒక ఫేక్ పాదయాత్రగా మారిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు రాజబాబు, విజయచందర్ పాల్గొన్నారు.