గంజాయి పట్టుకున్నా నిందలేనా? | Vijaya Sai Reddy Comments On TDP Yellow Media | Sakshi
Sakshi News home page

గంజాయి పట్టుకున్నా నిందలేనా?

Oct 3 2022 5:05 AM | Updated on Oct 3 2022 5:05 AM

Vijaya Sai Reddy Comments On TDP Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. గంజాయిని పట్టుకుంటే ఎల్లో మీడియా స్వాగతించకుండా ప్రభుత్వంపై బురద చల్లడం ఏమిటని ప్రశ్నించారు.  ఇంత భారీగా గంజాయిని పట్టుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా వైఎస్సార్‌సీపీ వ్యతిరేక శక్తులకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  

► దేశవ్యాప్తంగా 2021లో పట్టుబడ్డ 7,49,761 కిలోల గంజాయిలో ఏపీలో దొరికింది 2,00,588 కిలోలు. రెండో స్థానంలో ఉన్న ఒడిశాలో 1,71,713 కిలో లు లభ్యమైంది. నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో సగం వరకూ రెండు రాష్ట్రాల్లోనే పట్టుబడిందన్నారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వార్షిక నివేదికలో ఇటీవల ఈమేరకు సమాచారం ఇచ్చింది.  

► గంజాయి భారీ విస్తీర్ణంలో సాగయ్యే కేరళ, తమిళనాడులో ఏడెనిమిదేళ్ల క్రితం ప్రతికూల పరిస్థితులతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు విస్తరించింది. 2015–19 మధ్య టీడీపీ సర్కారు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల గంజాయి విచ్చలవిడిగా సాగైంది. విశాఖ ఏజెన్సీ, పక్కనే ఉన్న ఒడిశా అటవీ, పర్వత ప్రాంతాలు దశాబ్దాలుగా గంజాయి సాగుకు ఆలవాలంగా మారాయి.  

► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా, 2021లో భారీ మొత్తాల్లో గంజాయి లభ్యమైంది. సరైన దారులు లేకపోవడం, అమాయకులైన గిరిజనులను స్మగ్లర్లు మోసగించడం లాంటి పరిస్థితులను అధిగమించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. ఎన్సీబీ వార్షిక నివేదిక 2021లో రెండు పాయింట్లను పట్టుకుని టీడీపీ అనుకూల ప్రచారసాధనాలు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రజలు విశ్వసించరు. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణమే సర్కారు పనితీరుకు గీటురాయి.   

Advertisement
 
Advertisement
Advertisement