
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం.. చంద్రబాబుకు ఎక్కడిది?. మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ కట్టించడం హర్షించదగినది అని ప్రశంసలు కురిపించారు.
మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాల్లో పీపీపీ విధానం తీసుకురావడం సరైన విధానం కాదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. వైద్య, విద్యా రంగాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వాళ్లకే లబ్ది జరుగుతుంది. 1972 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు.. కోటేశ్వరులకు ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూములను 95 పైసలకు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు.
P4 విధానాన్ని చంద్రబాబు విరమించుకోవాలి. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి. UHI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టాలి. అమరావతిలో పెట్టేందుకు వీల్లేదు. టూరిజం పాలసీ ప్రకారం లులు కంపెనీలకు చంద్రబాబు కట్టబెడుతున్నాడు. లులు మీద ప్రేమతో ఆర్టీసీ స్ధలాన్ని 99 సంవత్సరాలకు ప్రైవేటు పరం చేశాడు. చంద్రబాబుకు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం ఎక్కడుంది?. విజయవాడలో లులు కంపెనీకి ప్రైవేట్ పరం చేసిన దానిపై సుప్రీంకోర్టులో ఫిల్ వేశాను.

చంద్రబాబుకు సానుకూలమైన పత్రికలోనే మట్టి దందా వార్తలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం బూడిద కంపెనీలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. గతంలో నీరు చెట్టు-కార్యక్రమంలో ఉన్న బాకీలు నేటి కూడా చంద్రబాబు చెల్లించలేదు. మంత్రి నారాయణ కళాశాలల్లో 10 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వండి. అప్పుడు పీఫోర్ విధానం అమలు చేయండి. గతంలో 75 ఏళ్లలో 2365 మెడికల్ సీట్లు ఉండేవి. వైఎస్ జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు వల్ల 2550 మెడికల్ సీట్లు వస్తాయి’ అని తెలిపారు.