ఇతర రాష్ట్రాల ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్న రేవంత్‌రెడ్డి

Telangana: Revanth Reddy Conducting Survey With Other States Agencies  - Sakshi

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పరిస్థితిపై ఫోకస్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల నాడిని పట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజలకు ఎలా దగ్గర కావాలన్న అంశంపై ఆరా తీయడం మొదలు పెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై రేవంత్‌రెడ్డి తన సొంత టీంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దేశం, రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడమే లక్ష్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీలతో ఈ సర్వే జరుపుతున్నారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 

ఎలా ముందుకెళ్లాలో తెలుసుకునేందుకే.. 
సర్వేలో భాగంగా రాజకీయ పార్టీలపై రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని ప్రధానంగా సేకరిస్తున్నట్టు సమాచారం. ఓవరాల్‌గా దేశంలో, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఎలా దగ్గరవుతోంది? వారి తక్షణ అవసరాలేంటి? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్‌ఎస్, అలాగే కాంగ్రెస్‌పై ప్రజల అభిప్రాయమేంటి? పెరుగుతున్న ధరలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే అంశాలపై నియోజకవర్గాల వారీగా సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఇప్పటివరకు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల పంథాలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా? అనే దానిపై అవగాహన కోసమే రేవంత్‌ అండ్‌ టీం ఈ సర్వేకు పూనుకున్నట్టు తెలుస్తోంది.

సర్వే తర్వాత వచ్చే నివేదికలతో.. ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై స్పష్టత వస్తుందని, దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేది రేవంత్‌ ఆలోచన అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. సర్వే సమాచారాన్ని తన పాదయాత్రకు ఫీడ్‌బ్యాక్‌గా ఉపయోగించుకునే వ్యూహంతోనే రేవంత్‌ సర్వేకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలంటున్నాయి.

కేసీఆర్‌... ఏమీ అనిపించడం లేదా? 
సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో విశ్వనగరం జోగుతుంటే రాష్ట్రంలో పాలన ఫాంహౌస్‌లో సేదదీరుతోందని ఫలితంగా సైదాబాద్‌లో ఆరేళ్ల గిరిజన పసిపాప బలైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్‌...ఏమీ అనిపించడం లేదా? న్యాయం కోసం బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? నేటి నీ దిష్టిబొమ్మదగ్ధం..రేపటి నీ పాలన చరమగీతానికి సంకేతం’అంటూ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనపై స్పందిస్తూ ఆదివారం ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 
చదవండి: ‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి: సీఎం యూటర్న్‌
గేదెపై వచ్చి మరీ అభ్యర్థి నామినేషన్‌.. ఎందుకంటే?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top