కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ను అంతర్గత సంక్షోభం కలవరపెడుతోంది. చీలిక దిశగా టీఎంసీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత్ బెనర్జీ వద్దకు అసంతృప్త నేతలు వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కోల్కతాలో పలుసార్లు రహస్య సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో కీలక సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వారిలో 50 మందికి తిరుగుబాటు చేస్తే దీదీకి కష్టాలు మొదలవుతాయి. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపైనా భవిష్యత్తులో పోరు జరిగే అవకాశం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో మమత నాయకత్వానికి కొత్త సవాల్ వస్తుంది. తాజా పరిణామాలు టీఎంసీ భవిష్యత్తు ఏంటన్న అంశంపై ఉత్కంఠ రేపుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసిన రిజు దత్తా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని, ఇటీవల ఓ హోటల్లో సమావేశమయ్యారని చెప్పారు. తమ వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, బెంగాల్లో “మహారాష్ట్ర మోడల్” తరహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. కొందరు పార్టీ నాయకులు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ స్పీకర్ను కలవనున్నారని కూడా చెప్పారు.
బెంగాల్లో మహారాష్ట్ర నమూనా?
బెంగాల్లో “మహారాష్ట్ర నమూనా” అమల్లో ఉందని రిజు దత్తా అన్నారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఏకమై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారని తెలిపారు. “మా వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే కాబట్టి, ప్రతిపక్ష నేతగా శోభన్దేవ్ చట్టోపాధ్యాయ్ కాదు, రితబ్రత బందోపాధ్యాయ్ ఉంటారు” అని రిజు దత్తా చెప్పారు. అలాగే, ఈ ఎమ్మెల్యేలే మెజారిటీగా ఉండడంతో పార్టీ గుర్తుపై కూడా తమకే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు.


