నీతి ఆయోగ్‌ సమావేశానికి నితీష్‌ కుమార్‌ డుమ్మా.. కారణం అదేనా? | Nitish Kumar skips Niti Aayog meet chaired by PM Modi in Delhi | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్‌ సమావేశానికి నితీష్‌ కుమార్‌ డుమ్మా.. కారణం అదేనా?

Jul 27 2024 2:28 PM | Updated on Jul 27 2024 2:53 PM

Nitish Kumar skips Niti Aayog meet chaired by PM Modi in Delhi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్‌  తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగుతోంది. వికసిత్‌ భారత్‌-2047 అజెండాగా సాగుతున్న ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌, సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.

అయితే ఈ సమావేశానికి విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. కేవలం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాజరవ్వగా.. ఆమెకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వలేదని, మైక్‌ కట్‌ చేశారంటూ ఆరోపిస్తూ మమతా సైతం ఈ భేటీ నుంచి వాకౌట్‌ చేశారు.

ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ కూడా నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాలేదు. బిహార్ తరపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌‌చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. 

అయితే నీతి ఆయోగ్ కీలక సమావేశానికి సీఎం నితీష్‌కుమార్ గైర్హాజరుపై దేశ రాజకీయాల్లో అప్పుడే చర్చ మొదలైపోయింది. కేంద్రం బీహార్‌కు ప్రత్యేక మోదాఇవ్వకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధానిగా అవతరించడంతో నితీష్‌ పార్టీ జేడీయూ కీలకంగా వ్యవహరించింది. అయినప్పటికీ తమ డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించడంతో నిరసనగా.. బిహార్‌ సీఎం ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన్నట్లు  సమాచారం.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు  ఈ సమావేశాన్ని బహిష్కరించారు. 

కాగా కేంద్ర ప్రభుత్వ విభాగమైన నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రిని చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు,  కేంద్ర మంత్రులను సభ్యులుగా ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement