పొలాలకు నీళ్లు.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు!  | Minister KTR in a program at Sirisilla Medical College | Sakshi
Sakshi News home page

పొలాలకు నీళ్లు.. ప్రతిపక్షాలకు కన్నీళ్లు! 

Sep 16 2023 1:48 AM | Updated on Sep 16 2023 1:51 AM

Minister KTR in a program at Sirisilla Medical College - Sakshi

సిరిసిల్ల/ సాక్షి నెట్‌వర్క్‌: తెలంగాణను మళ్లీ ఢిల్లీ చేతుల్లో పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చూస్తున్నాయని.. రాష్ట్రంలో పొలాలకు నీళ్లు అందుతుంటే, ప్రతిపక్షాలకు కళ్లమంటతో కన్నీళ్లు వస్తున్నాయని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. గత 65 ఏళ్లలో కాంగ్రెస్‌ వాళ్లు చేయని ఎన్నో పనులు తాము తొమ్మిదేళ్లలో చేశామని.. ధాన్యం ఉత్పత్తిలోనే కాదు డాక్టర్లను తయారు చేయడంలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివార్లలోని పెద్దూరు వద్ద మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం సిరిసిల్లలోని అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో మాట్లాడారు. ‘‘తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్లను తయారు చేయడంలోనూ అగ్రస్థానంలో ఉంది.

2014కు ముందు తెలంగాణలో ఐదే మెడికల్‌ కాలేజీలుంటే.. ఇప్పుడు 21 ఉన్నాయి. మరో ఎనిమిది ఏర్పాటు కానున్నాయి. అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నవే. అదే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేస్తే.. తెలంగాణకు మాత్రం ఒక్కటీ ఇవ్వలేదు. ఇలా తెలంగాణపై కేంద్రం పగబట్టినా.. రాష్ట్ర సొంత నిధులతో సీఎం కేసీఆర్‌ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశారు..’’ అని కేటీఆర్‌ చెప్పారు. 

జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు.. 
♦  ఖమ్మంలో మెడికల్‌ కాలేజీ ప్రారంబోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్‌ పాల్గొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య, వైద్యవిద్య రంగాల్లో సీఎం కేసీఆర్‌ నవశకానికి నాంది పలికారని పేర్కొన్నారు. 
 కర్ణాటక ఎన్నికలతో నిద్రలేచిన కాంగ్రెస్‌ నేతలు.. కేసీఆర్‌ రుణమాఫీ చేయడంతో బొక్కబోర్లా పడ్డారని జనగామ కాలేజీ వద్ద కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. 
 నిర్మల్‌ కాలేజీ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆసిఫాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ వద్ద విద్యార్థులు, యువకులు కోరడంతో మంత్రి మల్లారెడ్డి..‘‘పాలమ్మిన, పూలమ్మిన.. స్కూళ్లు, కాలేజీలు పెట్టిన.. మెడికల్‌ కాలేజీలు కట్టిన..’ అంటూ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. 
   భూపాలపల్లి మెడికల్‌ కాలేజీ ప్రారంబోత్సవంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. హైదరాబాద్, వరంగల్‌ వంటి నగరాల్లో అందే వైద్య సేవలు ఇకపై భూపా లపల్లిలో అందుతాయన్నారు. 
 కామారెడ్డి కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. వైద్యవిద్యలో దేశంలోనే అగ్రగామిగా నిలుçస్తున్నామని ఈ సందర్భంగా పోచారం పేర్కొన్నారు. 

అమ్మానాన్న అనుకున్నది వేరు.. 
‘‘నేను ఇంటర్‌లో బైపీసీ చదివా.. మా అమ్మ నన్ను డాక్టర్‌ను చేయాలనుకుంది.. మా నాన్న ఐఏఎస్‌ను చేయాలనుకున్నారు.. కానీ నేను ఆ రెండూ కాకుండా రాజకీయాల్లోకి వచ్చాను..’’ అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. తాను 1993లో ఎంసెట్‌ రాస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో 1,600వ ర్యాంకు వచ్చిందని, బీఫార్మసీలో సీటు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఏమైనా డాక్టర్‌ చదువు చాలా కష్టంతో కూడుకున్నదని.. ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement