
డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టా పంపిణీ సందర్భంగా ఉద్వేగానికి లోనైన మహిళను ఓదారుస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘ప్రదానమంత్రి నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలకోరు. బీజేపీ జుమ్లా, జూటా పార్టీ ఆఫ్ ఇండియా. ఆ పార్టీ ఒక వాట్సాప్ యూనివర్సిటీ. దానికి చాన్స్లర్ ఆయన. కథలు చెప్పడంలో ఆరితేరిన ప్రధాని సినిమా కథలు రాసేందుకు ప్రయత్నించాలి. ఆయన నటనకు తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుంది. ముఖ్యమంత్రితో జరిగిన అధికారిక సమావేశాలను నీచమైన రాజకీయాలకు వాడుతున్న మోదీ.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా మాట్లాడుతున్నారు. నన్ను ఆశీర్వదించాలని మోదీని కేసీఆర్ కోరారట! నేను సీఎం కావడానికి ఆయన అనుమతి తీసుకోవాలా? మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించేది ప్రధాని కాదు.. మా పార్టీ ఎమ్మెల్యేలనే విషయం కూడా ఆయనకు తెలియదు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మునిగిపోతున్న నావ. మునిగే నావను ఎక్కాలని ఎవరూ అనుకోరు. ఎన్డీయేలో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా? శివసేనతో సహా ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చాయి. ఆ పార్టీలో ఉన్నవి ప్రస్తుతం ఈడీ, సీబీఐ, ఐటీ మాత్రమే. సీఎం కేసీఆర్ ఒక ఫైటర్. నరేంద్ర మోదీ లాంటి చీటర్తో ఆయన కలిసి పనిచేయరు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. మంగళవారం బంజారాహిల్స్లోని వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ప్రధానితో సమావేశాలకు కెమెరా పట్టుకెళ్లాలేమో!
‘మేము ఢిల్లీకి, గుజరాత్కు బానిసలం కాదు. రెండుసార్లు ప్రజాస్వామికంగా గెలిచిన మాపై గుండెలు చించుకుని మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు. ప్రధాని చెప్పిన అబద్ధాలు విన్న తర్వాత ఇప్పటినుంచి ఆయనతో సమావేశానికి కెమెరా పట్టుకు వెళ్లాలేమో అని అనిపిస్తోంది. ఆయన మాటలను రికార్డు చేసుకుంటే మంచిది. ప్రధాని మోదీ జుమ్లాలకు ప్రసిద్ధి. అబద్ధాల ప్రచారకర్త. తనకు అలవాటైన అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నారు. తన విద్యార్హతల విషయంలోనే అబద్ధం చెప్పిన మోదీ మాటలను ఎవరు నమ్ముతారు? ఈ వయసులో కూడా మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడటం సమంజసంగా లేదు. ఇది ఎంతో బాధాకరం..శోచనీయం..’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాజులు, యువరాజులు అప్పుడెందుకు గుర్తుకు రాలేదు?
‘కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రధాని బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య సింథియా, జై షా, అనురాగ్ ఠాకూర్ ఎవరో చెప్పాలి. సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి వాళ్లపై కేసులు ఏమయ్యాయో చెప్పాలి. మోదీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ముఖ్యమంత్రుల గురించి అబద్ధాలు ఆడటం అలవాటుగా మారింది. బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, మేఘాలయలో సంగ్మాపై అబద్ధాలు ఆడి, ఆ తర్వాత వారితోనే పొత్తులు పెట్టుకుంటారు. రాజులు, రాజ్యాలు మోదీకి ఇప్పుడే గుర్తుకు వస్తాయి.
ప్రకాశ్సింగ్ బాదల్, ముఫ్తీ మహ్మద్ సయీద్, చంద్రబాబు, ఉద్దవ్ ఠాక్రే, దేవెగౌడ, కుమారస్వామితో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రం రాజులు, యువరాజులు గుర్తుకు రారు. చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రిగా ఉంటే అప్పుడు రాజులు, యువరాజులు ఎందుకు గుర్తుకురాలేదు? దేవెగౌడ కొడుకు కుమారస్వామి నిన్న మొన్ననే ఎన్డీయేలో చేరారు. అప్పుడు కుటుంబ రాజకీయాలు గుర్తుకు రాలేదా? ఆయన పార్టీలో ఉంటే ఇవేవీ గుర్తుకు రావు.
వారితో పొత్తు పెట్టుకుంటే మంచివాళ్లు. వారి పార్టీలో లేకపోతేనే అన్నీ గుర్తుకు వస్తాయి. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేసిందంటూ అబద్ధాలు చెబుతున్నారు. మేం డబ్బులు పంచుతుంటే మీ ఐటీ ఏం చేస్తోంది? తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టుకోరు. తలెత్తుకొని తిరుగుతారు. మీ బెదిరింపులకు భయపడరు..’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏం చేశారని ఓట్లడుగుతున్నారు?
‘ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణకు ఏమిచ్చారని ఓట్లు అడుగుతున్నారు? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కేటాయించలేదు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని ప్రధాని అంటున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం. ఈసారి బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు రెడీగా ఉన్న తెలంగాణ ప్రజలు మోదీ అబద్ధాలను పట్టించుకోరు. తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మరోసారి హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఈసారి 110 సీట్లు ఖాయం. 2018 ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు దక్కవు’ అని కేటీఆర్ అన్నారు.