Gita Press Awarded Gandhi Peace Prize Congress Says Like Rewarding - Sakshi
Sakshi News home page

గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ

Jun 19 2023 3:11 PM | Updated on Jun 19 2023 4:57 PM

Gita Press Awarded Gandhi Peace Prize Congress Says Like Rewarding - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మండిపడ్డారు...

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన హిందుత్వ భావాజాలానికి ముడిపెట్టారు.

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్, గాడ్సే వారసత్వానికి అవార్డు ఇస్తున్నారని ఆరోపించారు. 2015లో గీతా ప్రెస్‌లో రిలీజ్ అయిన, జర్నలిస్టు అక్షయ ముకుల్ రాసిన వివాదాస్పద పుస్తకాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కాగా.. రాజకీయంగా వివాదం రేగడంతో రూ.కోటి రూపాయల నగదును గీతా ప్రెస్‌ నిరాకరించింది.

గీతా ప్రెస్‌కు అవార్డు..
అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని కేటాయించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. 

ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి

భారత వారసత్వంపై దాడి..
గీతా ప్రెస్‌కు శాంతి బహుమతి కేటాయింపును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. కర్ణాటకాలో గెలుపు అనంతరం భారత వారసత్వంపై కాంగ్రెస్ బహిరంగంగానే దాడి చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకాలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలు తొలగించడం, గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని వ్యతిరేకించడం ఇందుకు నిదర్శనాలని దుయ్యబట్టారు. ప్రజలు ఇందుకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 

భారతదేశంలో హిందు సనాతన ధర్మానికి చెందిన జ్ఞానాన్ని గీతా ప్రెస్ అందిస్తోంది కాబట్టే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ముస్లీం లీగ్‌లో లౌకికత్వాన్ని చూడగలిగిన కాంగ్రెస్ పార్టీకి గీతా ప్రెస్‌లో మాత్రం మతపరమైన అంశం కనిపిస్తోందని దుయ్యబట్టారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ముస్లీం లీగ్‌ లౌకిక పార్టీ అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు.
ఇదీ చదవండి: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు దెబ్బ మీద దెబ్బ.. వరుసగా వలసలు 

Advertisement
 
Advertisement
Advertisement