హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకుగాను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక వినానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ స్వాగతం పలికారు. నడ్డా బేగంపేట నుంచి నేరుగా కొత్తపేటకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్ వరకు జరిగే రోడ్ షో లో నడ్డా పాల్గొననున్నారు.
బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అతిరథ మహారథులందరినీ హైదరాబాద్లో దించుతోంది. గ్రేటర్పై పూర్తి ఫోకస్ పెట్టింది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒక కార్పొరేషన్ ఎన్నికకు బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం, ఢిల్లీ నేతలందరూ సిటీలోని గల్లీలకు తరలిరావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. దుబ్బాక విజయం ఇచ్చిన ఊపు బీజేపీలో నయాజోష్ నింపింది. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదునుపెట్టింది. ప్రచారంపై దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇప్పటికే పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చింది.