
కాంగ్రెస్ పార్టీ ధీమా
వివిధ స్థాయిల్లో సేకరించిన అభిప్రాయాల నేపథ్యంలో అంచనా
అన్ని నియోజకవర్గాల్లో అనుకూల ఓటింగ్ జరిగిందన్న నేతలు
పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో సీఎం రేవంత్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో అంచనాలకు అనుగుణంగా మెరుగైన ఫలితాలను సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. వివిధ స్థాయిల్లో అభిప్రాయ సేకరణ తర్వాత 13 లోక్సభ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేస్తామనే తుది అంచనాకు వచ్చింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడి పోలింగ్ సరళిని సమీక్షించారు.
ఏయే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ, బీఆర్ఎస్ పోటీ ఇచ్చాయో ఆరా తీశారు. అన్నిచో ట్లా కాంగ్రెస్కు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని, వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గుచూపారని నేతలు పేర్కొన్న ట్టు తెలిసింది. మొత్తం మీద అన్నివర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైందనే అంచనాకు వచ్చారు.
పెరగనున్న ఓట్ల శాతం!
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 39.40 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 4 నుంచి 5 శాతం వరకు పార్టీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. వివిధ సర్వే సంస్థల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 13 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పక్కాగా గెలిచే అవకాశాలున్నాయని పార్టీ అంచనాకు వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో ఫలితాలు అంచనాకు అందడం లేదనే అభిప్రాయానికి వచ్చింది.
గెలిచే స్థానాలు ఇవే..
నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహ బూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ సహా నేతలు ధీమా వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు. మల్కాజిగిరి, కరీంనగర్ వంటి చోట్ల బీజేపీ పోటాపోటీగా ఉందని, ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గట్టెక్కుతారని పార్టీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
రెండో స్థానంలో బీజేపీ?
ఈ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలం పెరిగి అనూహ్యంగా రెండో స్థానానికి పోటీ పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్దపల్లి, వరంగల్, మెదక్, మహబూబాబాద్ లాంటి చోట్ల కూడా బీజేపీ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నాయి. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లే బీజేపీకి టర్న్ అయినట్లుగా పార్టీ నేతలు చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమేనని వారు పేర్కొన్నట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగను న్న ఉపఎన్నికపై సీఎం ఎ.రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న ఆ మూడు జిల్లాల ముఖ్య నాయకులతో మంగళ వారం రాత్రి ఆయన తన క్యాంపు కార్యాల యంలో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో దృష్టి సారించి పనిచేయాలని, తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు.
ఈ మూడు ఉ మ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాలుండగా, అందులో 33 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో కీలకంగా వ్యవహరించి మంచి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నను గెలిపించేందుకు కృషి చేయాలని సీఎం ఆయా జిల్లాల నేతలకు చెప్పారు.