వారికి రివిట్లు ఎక్కించే పరిస్థితి వస్తది: సంజయ్‌

Bandi Sanjay Slams TRS Leaders In Gurrampode Suryapet - Sakshi

గిరిజన భరోసా యాత్ర ఉద్రిక్తం

వివాదాస్పద గిరిజన భూముల పరిశీలనకు వచ్చిన బీజేపీ బృందం

గుర్రంబోడు తండాలోకార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట

రాళ్లదాడిలో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు గాయాలు

ఆ భూములను గిరిజనులకే అప్పగించాలని సంజయ్‌ డిమాండ్

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట /మఠంపల్లి: సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం తలపెట్టిన గిరిజన భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ కార్యకర్తలు, గిరిజనులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారుల రాళ్లదాడిలో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌తో విరుచుకుపడ్డారు.  మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని 540 సర్వే నంబర్‌లో ఉన్న గుర్రంబోడు తండా వివాదాస్పద భూములను పరిశీలించేందుకు గిరిజన భరోసాయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వంలోని బీజేపీ బృందం ఆదివారం ఇక్కడికి వచ్చింది. సంజయ్‌తోపాటు మాజీ ఎంపీ, సినీనటి విజయశాంతి, మాజీమంత్రులు విజయరామారావు, చంద్రశేఖర్, రవీంద్రనాయక్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్, ముఖ్యనేతలు పెద్దిరెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, స్వామిగౌడ్, సంకినేని వెంకటేశ్వరరావులతోపాటు మరికొంత మంది నేతలు గుర్రంబోడు తండాకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

షెడ్డుపై దాడితో ఉద్రిక్తత  
వివాదాస్పద భూములకు సమీపంలోనే ఓ కంపెనీకి చెందిన రేకుల షెడ్డు ఉంది. సదరు కంపెనీ నిర్వాహకులే తమ భూములను లాక్కుంటున్నారని కొంతకాలంగా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని బండితోపాటు ముఖ్యనేతలకు వివరించారు. ఈ క్రమంలో సంజయ్‌తోపా టు నేతలు ఈ షెడ్డు వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు షెడ్డుపైకి రాళ్లు విసిరారు. షెడ్డు రేకులను ధ్వం సం చేశారు. రాళ్లదాడిలో కోదాడ డీఎస్పీ రఘు తలకు, హుజూర్‌నగర్‌ సీఐ రాఘవరా వు ముఖానికి గాయాలయ్యాయి. కోదాడ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తలకు గాయమైంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటన అనంతరం సంజయ్‌ కార్యకర్తలను సముదాయించి అరకిలోమీటరు దూరంలో ఉన్న సభావేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లారు.

వారికి రివిట్లు ఎక్కించే పరిస్థితి వస్తది: సంజయ్‌ 
ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ 540 సర్వే నంబర్‌లోని 1,876 ఎకరాల్లో గిరిజనులు 70 ఏళ్లుగా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్నారని, ఈ భూములు వారికే చెందుతాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ గూండాలు, కబ్జాదారులు గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దాడులు చేసి కాళ్లు, చేతులు విరగొట్టి 40 మందిపై అక్రమంగా హత్యాయత్నం కేసులు మోపారని ఆరోపించారు. గిరిజనులపై లాఠీచార్జి చేయించిన టీఆర్‌ఎస్‌ నేతల కాళ్ల తొడలకు రివిట్లు ఎక్కించే పరిస్థితి త్వరలో వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ కుట్ర పన్ని లాఠీచార్జి చేయించారని ఆరోపించారు. గిరిజనుల కోసం అవసరమైతే తాను జైలుకైనా వెళ్తానని, జైల్లో కేసీఆర్‌ కోసం మరో గది ఏర్పాటు చేయిస్తానన్నారు.

రానున్న అసెంబ్లీ బడ్జెట్‌లో లాఠీలు కొనేందుకు, జైళ్లు కట్టేందుకు నిధులు కేటాయించుకోవాలని ఎద్దేవా చేశారు. గుర్రంబోడు నుంచి మరో కరసేవను ప్రా రంభిస్తున్నామని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ బహిరంగసభలో గిరిజన భూ ముల సమస్యపై సీఎం స్పష్టమైన ప్రకట న చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ తాగి ఫాంహౌస్‌లో పడుకొని.. సీఎం పద వి తన ఎడమ కాలితో సమానమని అం టున్నారన్నారు. ఒకప్పుడు పైలట్‌గా పనిచేసిన పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ కారు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయశాంతి మాట్లాడుతూ ‘కేసీఆర్‌ దొర గిరిజనుల భూములను దోచు కుంటున్నార’ని ఆరోపించారు. తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెచ్చానని చెప్పి.. కేసీఆర్‌ కుటుంబమే తెలంగాణను దోచుకుంటోందని, ఇలాంటి వ్యక్తితో తాను పని చేసినందుకు తలదించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top