ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సవాల్కు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సిద్ధం కావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని బిజేంద్రారెడ్డి ఇంటికి వస్తానని అఖిలప్రియ సవాల్ విసరడంతో దానికి గంగుల ప్రతి సవాల్ విసిరారు.
అవి ఆరోపణలు కాదు.. అన్నీ వాస్తవాలే అంటూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రతి సవాల్కు విసిరారు గంగుల బిజేంద్రారెడ్డి. ఆధారాలతో సహా నిరూపిస్తానని గంగుల చాలెంజ్ చేశారు. అహోబిలం తలనీలాల వివాదంలో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం. నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గంగుల బిజేంద్రారెడ్డి నివాసం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
ఈ క్రమంలోనే అహోబిలం వెళ్తున్న బిజేంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గంగుల బిజేంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
అహోబిలంలో జరుగుతున్న అక్రమాలపై చర్చకు సిద్ధమన్నారు గంగుల బిజేంద్రారెడ్డి. ఆధారాలతో సహా నిరూపిస్తానని, ఆళ్లగడ్డ ప్రజలకు జరిగే అన్యాయాలపై పోరాడుతూనే ఉంటానన్నారు. ఇకనైనా అఖిలప్రియ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.


