జిల్లా సమాచారం
పెద్దపల్లిరూరల్: జీవనోపాధికోసం చేపలవేటపై ఆధారపడిన మత్స్యకారులకు నైపుణ్య శిక్షణ కరువైంది. జిల్లాలోని చెరువులు, కుంటల్లో పెంచిన చేపలను పట్టేందుకు సరైన నైపుణ్యం లేక చాలామంది నీటమునిగిపోతున్నారు. ఇందులో చెరువులు, కుంటల్లోకి దిగిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. చేపలను పట్టే వృత్తిపై ఆధారపడి జీవించే వారికి గతంలో ఏటా అవసరమైన నైపుణ్యశిక్షణ ఇప్పించేవారు. సొసైటీలో సభ్యత్వం ఇచ్చే సమయంలోనే సంబంధిత అధికారులు పరీక్షించేశారు.
చేపలు పట్టబోయి..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులోనే మునిగి మృత్యువాత పడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12మంది వరకు ఇలా మరణించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వారికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షల పరిహారం అందిస్తున్నారు.
కరువైన నైపుణ్యశిక్షణ
చేపలు పట్టేందుకు చెరువులోకి దిగే మత్స్యకారుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. నాలుగేళ్లుగా శిక్షణ ఊసే కనిపించడం లేదు. దీంతో కుటుంబపోషణ కోసం చేపలను పట్టేందుకు పూర్వీకుల నుంచి నేర్చుకున్న పద్ధుతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఆధునిక సాంకేతికపై శ్రద్ధ ఏది?
సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతతో వివిధ వృత్తులపై ఆధాపడ్డ వారికి యాంత్రీకరణలో భాగంగా పనిముట్లను అందిస్తున్న ప్రభుత్వం.. చేపలు పట్టే వృత్తిపై ఆధారపడ్డ వారిపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గీత కార్మికులకు కాటమయ్యరక్షణ కవచం లాంటి పరికరాలను అందించిన సర్కారు.. తమకు చేపలను పట్టేందుకు వీలుగా పనిముట్లను రూపొందించాలని లేకుంటే కనీసం నైపుణ్యశిక్షణనైనా ఇప్పించాలని కోరుతున్నారు.
చెరువులు, కుంటలు 1,076
సొసైటీలు 216
సభ్యుల సంఖ్య 15,337
మత్స్యకార సంఘాలు(పురుషులు) 147
సభ్యుల సంఖ్య 11,575
మహిళా సంఘాలు 46
సభ్యుల సంఖ్య 2,251
మార్కెటింగ్ సొసైటీలు 15
సభ్యులు 1,116
లైసెన్స్డ్ మార్కెటింగ్ సొసైటీలు 08
సభ్యులు 395


