గోదావరిఖని: సింగరేణిలో మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజాభవన్ ముట్టడిస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆర్జీ–1 జీఎం కార్యాలయం ధర్నా నిర్వహించారు. గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరిట గతంలో 20వేల మందిని, డిస్మిస్ పేరిట పది వేల మందిని నాటి ప్రభుత్వాలు తొలగించాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదేపోకడ కొనసాగిస్తోందన్నారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని, కారుణ్య నియమాకాల ద్వారా నియమితులైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరింపులకు గురిచేయడం దారుణమన్నారు. సంస్థను పరిరక్షించుకోవడానికి పోరాటానికి సిద్ధ కావాలని ఆయన కోరారు. నాయకులు వడ్డేపల్లి శంకర్, మాదాసు రాంమ్మూర్తి, నూనె కొమరయ్య, చెల్పూరి సతీశ్, జావిద్పాషా, పోలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


