పెద్దపల్లి: ఎంసీహెచ్ ద్వారా గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం పనితీరుపై కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం సమీక్షించా రు. ప్రసవం గడువు సమీపించిన గర్భిణుల వివరాలు ఈడీబీ రిజిష్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ప్రసవం తర్వాత కూడా తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంథని ఎంసీహెచ్ పనితీరు గతం కన్నా మెరుగైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎస్సార్ నిధులు సద్వినియోగం చేసుకోవాలి
సీఎస్సార్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సీఎస్సార్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి అధికారులతో సమీక్షించారు. సింగరేణి ద్వారా రామగుండంలో రూ.ఐదు కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదించామన్నారు. ఎన్టీపీసీ యాష్ పాండ్ వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఆయన సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
పాలకుర్తి: భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. స్లాట్ బుకింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. తహసీల్దార్ సునీత, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు రజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


