ఓదెల: గోపరపల్లె పాఠశాల ప్రహరీ నిర్మాణాన్ని కొంద రు అడ్డుకుంటున్నారని సర్పంచ్ మద్దెనవేని రవి ఆరోపించారు. ఈమేరకు గ్రామస్తులతో కలిసి మంగళవారం గ్రామంలో రాస్తారోకో చేశారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో పాఠశాల భద్రత కోసం ప్రహరీ నిర్మాణం చేపట్టామని గ్రామస్తులు తెలిపారు. తహసీల్దార్, ఆర్ఐ, కార్యదర్శి 25 ఏళ్ల క్రితమే పాఠశాల కోసం స్థలం కొనుగోలు చేశారని అన్నారు. అయినా, దానిపై లీగల్ నోటీసు ఉందని పనులు చేసే కాంట్రాక్టర్ను కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన రహదారి పక్కనే పాఠశాల ఉందని, విద్యార్థులకు ప్రమాదాలు జరిగితే అధికారులే బాధ్యత వహిస్తున్నారని తెలిపారు. సుమారు రెండు గంటలపాటు రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలకు అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు.
గోపరపల్లె గ్రామస్తుల ఆరోపణ


