పొలాలకు పోవుడు కష్టమైతాంది
తాత ముత్తాతల నుంచే..
నెరవేరని బీటీ రోడ్డు కల
ఊరి మధ్యలో మత్తడి.. పరిష్కారమేది?
మంథనిరూరల్: ఎన్నికలు.. ఓట్లు రాగానే ఊళ్లో సమస్యలు తీరుస్తామని అభ్యర్థులు హామీలు ఇవ్వడం సర్వసాధారణమే. ఎన్నికలు ముగిశాక మళ్లీ ఆ సమస్యను పట్టించుకోకపోవడం సర్వసాధారణమే. ఇలాంటి సమస్యే పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారంలో ప్రజల్ని పట్టిపీడిస్తోంది. మట్టి రోడ్డు బీటి రోడ్డుగా ఎప్పుడు మారుతుందోనని దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్ప రైతుల కల నెరవేరడం లేదు. నాగారం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ పక్కనుంచి ఉప్పట్ల వరకు గతంలో మట్టిరోడ్డు ఉండేది. దీనిపరిధిలో సుమారు 300 ఎకరాల నుంచి 400ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఏటా సాగు పనులకు ఈ రోడ్డు ద్వారానే వెళ్తుంటారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయం కావడంతో రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తన బస్తాలు తీసుకురావడానికి నానాతంటాలు పడుతుంటారు. వర్షం పడితే కాలినడకే శరణ్యం. గత ఎన్నికల సమయంలో ఈ రోడ్డు బాగు చేయిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని వాపోతున్నారు.
మానకొండూర్: మండలంలోని ఈదులగట్టెపల్లిలో ఊరి మధ్యలో ఉన్న మత్తడి ఏళ్ల తరబడిగా గ్రామస్తులను వేధిస్తోంది. మత్తడి పొంగిన సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన పాలకుల హామీలు నీటిమూటలే అవుతున్నాయి. గ్రామ తలాపునే ఊర చెరువు ఏటా వర్షాకాలంలో నిండి మత్తడి పొంగుతోంది. మత్తడి నీరు ఊరు మధ్య నుంచే వెళ్లడంతో గ్రామం రెండుగా చీలిపోతుంది. మత్తడి తగ్గే వరకూ గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో మత్తడి ప్రాంతాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ఈదులగట్టెపల్లి స్టేజీ నుంచి అన్నారం వరకు తారు రోడ్డు మంజూరు చేసి, మత్తడి ప్రాంతంలో కల్వర్టు వేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. కానీ, గ్రామంలోని రాజకీయ నాయకుల మధ్య సయోధ్య లేక ఆ పనులు కూడా నిలిచినట్లు గ్రామస్తులు వాపోతున్నారు.
ఎన్నికలయ్యే వరకు నీకు నాకు కటీఫ్..
రాయికల్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని నిన్నటివరకు మిత్రులుగా ఉన్నవారు దూరందూరంగా ఉంటున్నారు. పొద్దంతా ఒకే వాహనంపై తిరుగుతూ సరదాగా గడిపిన వారు ఇప్పుడు ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. సర్పంచ్గా పోటీచేసే ఆశావహులు తన మిత్రులు ఇతరవ్యక్తులకు నచ్చకపోతే ఎక్కడ ఓట్లు పడవోనని భావించి.. శత్రువును చూసినట్లు చూస్తున్నారు. దీంతో ఓటర్లంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు తన స్నేహితుడు అని చెప్పుకుని ఎన్నికల వేళ తనకు శత్రువు అంటే ఎవరు నమ్ముతారంటూ ఓటర్లు చర్చించుకుంటున్నారు. పోలింగ్ వరకు ఇలాంటి నాటకీయ పరిణామాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఎన్నికల బరిలో రేషన్ డీలర్లు.. ఆర్ఎంపీలు
జగిత్యాలజోన్: సర్పంచ్గా పోటీ చేసేందుకు రేషన్ డీలర్లు, ఆర్ఎంపీలు కూడా సై అంటున్నా రు. రేషన్ సరుకుల కోసం వచ్చిన వారితో సత్సంబంధాలు ఉండటంతో రేషన్ డీలర్లు.. అనారో గ్యం బారినపడిన వారికి వైద్యం అందించేందుకు ఇళ్లిళ్లూ తిరిగే ఆర్ఎంపీలు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలిస్తే సర్పంచ్.. లేదంటే మళ్లీ అదే పని చేసుకోవచ్చు.. అంటూ వారిని బంధువులు, తెలిసిన వారు ఊదరగొ డుతున్నారు. అభ్యర్థులు ఖర్చు జోలికి వెళ్లకుండా నే రుగా ఓటర్లను కలిసి తమను గెలిపిస్తే అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
దశాబ్దాలుగా ఎదురుచూపులే
ఓట్ల్లేస్తే రోడ్డస్తదనే ఆశలు మొదలు
రైతులకు తప్పని బురదరోడ్డు కష్టాలు
పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తా. వర్షాలు పడితే పొలం కాడికి పోవడం కష్టమైతాంది. రోడ్డంతా బురదమయమై నడవలేని పరిస్థితి ఉంటది. ఈరోడ్డు బీటీ రోడ్డు అయితే మా కష్టాలన్నీ తీరిపోతయ్. ఈసారైనా రోడ్డు బాగు చేయిస్తే రుణపడి ఉంటం.
– గోపు శ్రీకాంత్, రైతు, నాగారం
మా తాత ముత్తాతల నుంచే చెరువు మత్తడి నీరు గ్రామ మధ్య నుంచి వెళ్తోంది. ఎనకట మత్తడి పోతంది అంటే మేము గొర్లను మంద పెట్టుకుని గుట్టలకే ఉండేటోళ్లం. మత్తడి నీరు వెళ్తున్నప్పుడు అటోళ్లు ఇటు, ఇటోళ్లు అటు వెళ్లడానికి ఇబ్బందులుంటాయి. ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరు మత్తడి నీరు వెళ్లకుండా చూద్దామని అంటర్రు తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు.
– దానవేని రాయమల్లు, ఈదులగట్టెపల్లి
విలేజ్ వాయిస్
విలేజ్ వాయిస్


