
కానరాని కారుణ్యం!
ఆరు నెలల క్రితం నిలిచిన మెడికల్బోర్డు ఇప్పటికీ విధుల్లో చేరని కార్మిక వారసులు 40 ఏళ్లు దాటితే పరిస్థితి ఏమిటని ఆందోళన
గోదావరిఖని(రామగుండం): కాలం కరుగుతోంది. కారుణ్య నియామకాల కోసం కార్మికులు నిరీక్షిస్తున్నారు. ఆరునెలలు గడిచినా అతీగతీలేదు. సింగరేణిలో అనారోగ్యం బారిన పడిన కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారిస్థానంలో వారసులకు ఉద్యోగం ఇచ్చేలా యాజమాన్యం అవకాశం కల్పించింది. దీంతో యువ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 2018 మార్చిలో మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రారంభమైంది. సుమారు 116 మెడికల్ బోర్డులు నిర్వహించారు. వీటిద్వారా దాదాపు 16వేల మందికిపైగా కార్మిక వారసులు ఉద్యోగాల్లో చేరారు. అయితే, ఆ రునెలలుగా మెడికల్ బోర్డు నిలిచిపోయింది. కారు ణ్య నియామకాలు ఆగిపోయాయి. ఇప్పటికే మెడికల్ బోర్డుకు హాజరై ఇన్వాలిడేషన్ అయిన వారిస్థానంలో వారసులకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది.
2018 నుంచి
సింగరేణిలో 2018 నుంచి కారుణ్య నియామక ప్రక్రియ కొనసాగుతోంది. యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పతిలో ప్రతీ నెలమెడికల్ బోర్డు నిర్వహిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక్కోనెలలో రెండు మెడికల్బోర్డులు కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.
కారణాలపై అస్పష్టత..
మెడికల్ బోర్డు నిలిచిపోవడానికి గల కారణాలపై గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు స్పష్టత ఇవ్వడంలేదు. జూలై చివరి వారంలో నిర్వహించిన హయ్యర్ సెంటర్ మెడికల్ బోర్డులో 55మందిని ఆహ్వానించగా.. ఒకరు గైర్హాజరయ్యారు. మిగతా వారిలో ఐదుగురినే మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. మిగతా వారిని సేమ్జాబ్, మరికొందరిని అండర్గ్రౌండ్ నుంచి ఉపరితలనానికి కేటాయించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న కార్మికులను కూడా ఫిట్ఫర్ సర్ఫేస్ ఇవ్వడంతో కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
కారుణ్యం ఉంటుందా?
ఆరునెలలుగా రెగ్యులర్ మెడికల్ బోర్డు నిర్వహణ లేకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారుణ్యం ఉంటుందా? నిలిచిపోతుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సింగరేణి సీఎండీ బలరాం, గనుల శాఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.