
సహకార సంఘాల్లో బదిలీల జాతర
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)ల్లో బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కార్యదర్శు(సీఈవో)లతోపాటు ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవల ఉత్తర్వులను జారీచేసింది. దీర్ఘకాలంగా ఒకే సింగల్విండోలో పనిచేయడంతో రైతులను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఉద్యోగుల బదిలీకి శ్రీకారం చుట్టింది. త్వరలో బదిలీలు ఉంటాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించడం గమనార్హం.
తొలిసారి బదిలీలు..
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖల పరిధిలోని ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈమేరకు గతనెల 20న ఉద్యోగుల వివరాలు నమోదు చేసింది. ఒకేప్రాంతంలో మూడు నుంచి ఐదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని కచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, వందేళ్ల చరిత్ర కలిగిన సహకార సంఘాల్లో బదిలీలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషమని అంటున్నారు. జిల్లాలో కార్యదర్శులు 20 మంది ఉండగా సిబ్బంది 92 ఉన్నారని అంచనా.
ఏళ్ల తరబడి ఒకేచోట..
సహకార సంఘాల ఉద్యోగులు, సిబ్బంది ఏళ్ల కొద్దీ ఒకే సంఘంలో పనిచేయడంతో సోమరిపోతుల్లాగా మారారని, తాము చెప్పిందే నడుస్తుందనే భావనతో రైతులు, పాలకవర్గ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. చాలామంది ఉద్యోగులు, సిబ్బంది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తుండడంతో సమస్యలు వస్తున్నాయని, సంఘాల అధ్యక్షులను గుప్పిట్లో పెట్టుకొని పెత్తనం చెల్లాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారిని బదిలీ చే యవద్దని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
● దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి స్థానచలనం
జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీచేసిన 44 జీవోను సవరిస్తూ కొత్తగా 82 జీవోగా మార్చింది. బదిలీ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఉమ్మడి జిల్లా పరిధిలో కాకుండా జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రిటైర్మెంట్కు దగ్గర ఉన్నవారిని బదిలీ చేయవద్దు.
– బొంగోని శంకర్గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రాథమిక సహకార సంఘాల అసోసియేషన్

సహకార సంఘాల్లో బదిలీల జాతర