
ప్రధాన కూడళ్లు.. ప్రమాదాలకు నిలయాలు
● కమాన్ చౌరస్తా వద్ద డివైడర్ను ఢీకొన్న లారీ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై ప్రధాన కూడళ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. స్థానిక కమాన్ వద్ద మంగళవారం కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టింది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు ఏర్పాటు చేసిన తాత్కాలిక డివైడర్లతో రోడ్డు ఇరుకుగా మారింది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన లారీ డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకున్నా.. రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల రాకపోకలను నిత్యం పర్యవేక్షిస్తున్నా.. ప్రమాదాలను నియంత్రించలేకపోతున్నారు. రంగంపల్లి, చీకురాయి క్రాస్రోడ్డు, కమాన్చౌరస్తా, కూనారం క్రాస్రోడ్డు, సివిల్ ఆస్పత్రి, ప్రగతినగర్, బస్టాండ్ ప్రాంతాల వద్ద రోడ్లు దాటేందుకు వాహనదారులు, పాదచారులు జంకుతున్నారు. బస్టాండ్ కూడలిని విస్తరించేందుకు ప్రతిపాదించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు పెరుగుతున్న ట్రాఫిక్ను నియంత్రించడం, చౌరస్తాల వద్ద రోడ్డు దాటేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.