గజపతినగరం: మండల కేంద్రంలోని పురిటిపెంట న్యూ కాలనీ దగ్గరలో ఉన్న ఓ స్వీట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ..వాయు కాలుష్యానికి కారణమవుతోంది. స్వీట్లు తయారు చేసే పరిశ్రమ పొగగొట్టాల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ కాలనీ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించి, శీతాకాలంలో పడే పొగమంచు మాదిరి కనిపిస్తోంది. పొగ వల్ల కళ్లమంటలు, దగ్గు వంటివి వస్తున్నాయని, పలువురు శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికార యంత్రాంగానికి తెలిసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం, సాయంత్రం పొగమంచులా..
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి ఉదయం, సాయంత్రం వాకింగ్, జాగింగ్కు వెళ్లే వారు, అదే గ్రౌండ్లో క్రికెట్, వాలీ బాల్ ఆడేవారంతా పొగమంచును తలపిస్తున్న ఆ పొగను చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఆరోగ్యం కోసం వస్తే రోగం తెచ్చుకున్నట్లు ఉందని, ఇటువంటి కలుషిత గాలిని పీల్చితే ఆరోగ్యం పోదా అని అంటున్నారు. కమ్ముకున్న దట్టమైన పొగ వల్ల ఒక్కోసారి దారి కూడా కనిపించడం లేదని, ఇలా అయితే ఇక్కడి వారమంతా రోగాల బారి నపడి మరణించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్వీట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగలు
తీవ్ర కాలుష్యంతో నిండిపోతున్న
పరిసర ప్రాంతాలు
రోగాల బారినపడుతున్న స్థానికులు
పట్టించుకోని అధికార యంత్రాంగం


