అవినీతికి కేరాఫ్ ఉపాధి
● పెచ్చు మీరుతున్న అక్రమాలు ● బినామీ మస్తర్లు ద్వారా దోచుకుంటున్నట్టు విమర్శలు
● సామాజిక తనిఖీల్లో బయట పడుతున్న ఉపాధి అక్రమాలు
● విజయనగరం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి నిర్వహించిన సామాజిక తనిఖీలో రూ.40 లక్షల వరకు అక్రమాలకు జరిగినట్టు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. ఈ మండలంలో రూ.కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
––––––––––––––––––––––––––––
● రాజాం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో సుమారుగా రూ.30 లక్షల వరకు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
––––––––––––––––––––––––––––
● గంట్యాడ మండలం నరవ గ్రామంలో అయితే ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లు సైతం మస్తర్లు వేసుకుని డబ్బులు డ్రా చేసేశారు. ఓ ప్రైవేటు కాలేజ్లో పనిచేసే ఓ ఉద్యోగి పేరు మీద, విజయనగరంలోని కలెక్టరేట్లోని ఓ ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగి పేరు మీద మస్తర్లు వేసి డబ్బులు డ్రా చేసేశారు. దీనిపై గంట్యాడ ఎంపీడీఓ విచారణ కూడా చేపట్టారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై విచారణతో సరిపెట్టేసి చర్యలు ఏమి తీసుకోలేదనే ఆరోపణలున్నాయి.
విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకంలో అక్రమాలు ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పథకం అధికార పార్టీ కల్ప వృక్షంగా మారిందనే చర్చ నడుస్తోంది.
టీడీపీ నేతలకు ఉపాధి సిబ్బంది సహకారం
టీడీపీ నాయకుల దోపిడీకి ఉపాధి హామీ సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఉపాధి సిబ్బందికి బినామీ మస్తర్లు వేయాల్సిన పేర్లు ఇచ్చి వారికి మస్తర్లు వేయించి వారి ద్వారా దోపిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఖాతాల్లో డబ్బులు జమ కాగానే వాటిని తీయించి డబ్బులు తీసుకుంటున్నారనే సమాచారం. కొంతమంది మేట్లు అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసిన వారికి, పనికి రాని వారికి, పనికి రాలేని వృద్ధుల పేరు మీద కూడ బినామీ మస్తర్లు వేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాజిక తనిఖీల్లో బయట పడుతున్న
అక్రమాలు
ఉపాధి హామీలో అక్రమాలు సోషల్ ఆడిట్ సిబ్బంది సాక్షిగా సామాజిక తనిఖీల్లో బట్టబయలు అవుతున్నాయి. ప్రతీ ఏటా సోషల్ ఆడిట్ సిబ్బంది ఆయా గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించి వేతనదారుల ఇంటికి వెళ్లి ఉపాధి హామీ పనికి వెళ్లారా.., వెళితే ఎన్ని రోజులు వెళ్లారు, పనికి వెళ్లిన అన్ని రోజులకు డబ్బులు వచ్చాయా.. లేదా.., పనికి వెళ్లకుండా మస్తర్లు వేసారా.. అని సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ తనిఖీల్లో ఉపాధి హామీ సిబ్బంది చేసే అక్రమాలు బయట పడుతున్నాయి.
జిల్లాలోని జామి, విజయనగరం, మెంటాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ, కొత్తవలస, వేపాడ, రాజాం మండలాల్లో ఇప్పటి వరకు సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విజయనగరం మండలంలో మిగతా మండలాల కంటే ఎక్కువ మొత్తంలో జరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.


