విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
వీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని బీసీ కాలనీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.విద్యుత్ లైన్లు కలవడంలో లైన్ ట్రిప్ అవగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని స్థానికులు విద్యుత్ కార్యాలయానికి తెలియజేయడంతో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం విద్యుత్ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వచ్చి మరమ్మత్తులు చేపట్టారు. విరిగిన చోట కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వీరఘట్టం పట్టణమంతా సుమారు రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కారు నడుపుతున్న రెడ్డి అనే వృద్ధుడికి పెద్దప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ స్తంభం విరిగినందుకు గాను కొత్తగా వేసిన విద్యుత్ స్తంభానికి ఎస్టిమేషన్ వేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తి నుంచి పెనాల్టీ కట్టిస్తామని ట్రాన్స్కో ఏఈ సోమేశ్వరరావు తెలిపారు.


