ఉపాధి
ప్రభుత్వమే ఖర్చు చేస్తే..
వేలాదిమందికి ఉపయోగం
వైటీసీ ఉద్యోగులకు
జీతాలూ కరువు
నిరుద్యోగులకు శిక్షణ పేరిట కాంట్రాక్టులు అప్పగింత వైటీసీల ద్వారా వివిధ కోర్సుల్లో తర్ఫీదు
ప్రతిసారీ అవే ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు
మూడో కంటికి తెలియకుండా
వ్యవహారం
జేబు సంస్థలకు
సాక్షి, పార్వతీపురం మన్యం:
గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పేరిట శిక్షణ అందించి..పెద్ద ఎత్తున నిధులు సంబంధిత అధికారులు వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదువుకుని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గిరిజన యువతకు.. స్వయం ఉపాధి పొందేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో వైటీసీల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు అగర్బత్తి, ఫినాయిల్ తయారీ, పురుషులకు డ్రైవింగ్, బైక్ మెకానిక్ వంటివాటిలో 45 రోజులపాటు తర్ఫీదు అందిస్తుండగా..ఒక్యో బ్యాచ్లో 30 నుంచి 40 మంది వరకు ఉంటున్నారు. గత ఏడాది బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వగా..అప్పట్లోనే నిధుల దుర్వినియోగంపై ఆరోపణలొచ్చాయి.
వైటీసీల్లో వివిధ బ్యాచ్లకు..
ప్రస్తుతం నిరుద్యోగ గిరిజన యువతకు వారి అభిరుచులకు తగ్గట్లు పలు రకాల వృత్తి విద్యాశిక్షణ కోర్సులను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం, సాలూరుల్లో యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ)ల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ప్రతిసారీ ఒకే శిక్షణ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగిస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియలో కనీస నిబంధనలు పాటించకుండా, ఏకపక్షంగా అప్పగిస్తున్నారన్న వాదనలున్నాయి. సంకల్ప్ నిధులతో నెక్ట్స్జెన్, సాఫ్ట్ప్రో సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వేలాదిమందికి ఉపాధి చూపిస్తామని చెప్పి..అందులో కనీసం పదిశాతం మందికై నా ప్రైవేట్ ఉద్యోగాలు చూపడం లేదని సమాచారం. గతంలోనూ బీసీ మహిళలకు ఒక్కొక్కరికీ రూ.25 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి తీసుకుని అరకొరగా టైలరింగ్ శిక్షణ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. కనీసం కుట్టుమిషన్లు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో రూ.50 వేల వస్తువు కొనుగోలు చేయాలన్నా దాదాపు పది షాపుల నుంచి ధరలు తెప్పించుకుని..ఏది నాణ్యంగా ఉంటుందో, ఎక్కడ తక్కువగా వస్తుందో చూసుకుని మరీ ఎంపిక చేస్తారు. అలాంటిది రూ.లక్షల బిల్లులు తీసుకుని నిరుపేద గిరిజన యువతకు అన్యాయం చేస్తున్నారు. కనీసం బహిరంగ టెండరింగు లేకుండా ప్రతిసారీ అవే సంస్థలకు కాంట్రాక్టు అప్పగించడం.. కావాలని వాటాలు పంచుకోవడమేనని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రతిసారీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే డబ్బుల్ని నేరుగా ప్రభుత్వమే ఖర్చు చేయగలిగితే వేలాదిమందికి శిక్షణ ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 500 మందికి శిక్షణ ఇస్తున్న చోట..అవే డబ్బులతో 2 వేల మందికిపైగా ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఐటీడీఏ అధికారుల పూర్తి సహకారం, పరోక్ష ప్రయోజనాల కోసమే బినామీ సంస్థలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
వైటీసీలను ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు..కనీసం ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. వైటీసీల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగులకు సుమారు రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కో సెంటర్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్, ఒక మేనేజర్ చొప్పున పని చేస్తున్నారు. వారికి క్యాడర్ను బట్టి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా జీతాలు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి


