8 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు
● గుర్ల పోలీసులను అభినందించిన సీఐ శంకరరావు
గుర్ల: తల్లిదండ్రులు చూసిన వివాహం ఇష్టం లేక గుర్ల మండలంలోని చింతలపేటకు చెందిన పాలూరి పైడిరాజు ఏనిమిదేళ్ల క్రితం పెళ్లి ముందురోజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ పైడిరాజు తల్లిదండ్రులు రమణ, రామయ్యమ్మలు కుమారుడి కోసం వెతకని ప్రదేశం లేదు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మిస్సింగ్ కేసుల వివరాలు మళ్లీ ప్రయత్నించగా కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చికుని సీ–ట్రేస్, గూగుల్ మ్యాప్ ద్వారా పైడిరాజు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజ మండల కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గుర్ల పోలీసులు అక్కడికి వెళ్లి పైడిరాజును గుర్ల పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కుటుంబసభ్యులకు గురువారం అప్పగించారు. ఎనిమిదేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వ్యక్తిని పట్టుకుని గుర్ల పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్సై పి.నారాయణరావు, కానిస్టేబుల్ ఎం.మురళి, మీసాల సురేష్కు పైడిరాజు కుటుంబసభ్యులలు ధన్యావాదాలు తెలియజేశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని సీఐ శంకరరావు అభినందించారు.
ట్రాక్టర్ తొట్టెల దొంగ అరెస్టు
శృంగవరపుకోట: ట్రాక్టర్ తొట్టెలు, వాటర్ ట్యాంకులు మాయం చేస్తున్న దొంగను ఎస్.కోట పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ మేరకు సీఐ వి.నారాయణమూర్తి చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన ఎస్.కన్నారావు తన ట్రాక్టర్ తొట్టె, వాటర్ ట్యాంక్ను దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్.కోట పోలీసులు దర్యాప్తు చేపట్టగా గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన ఎం.ఎర్నాయుడు చోరీలకు పాల్పడినట్లు ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది గుర్తించారు. దీంతో ఎర్నాయుడును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. ఎర్నాయుడు గతంలో మోటార్ సైకిల్స్ చోరీ చేసేవాడు. వేర్వేరు పోలీస్స్టేషన్లలో 7కేసులు నమోదయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసి రెండు ట్రాక్టర్ తొట్టెలు, ఒక వాటర్ ట్యాంక్ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచగా, మెజిస్ట్రేట్ రిమాండ్ నిమిత్తం సబ్జైలుకు పంపుతూ తీర్పు ఇచ్చారని సీఐ తెలిపారు.
ధాన్యం నిల్వల పరిశీలన
సీతానగరం: జిల్లాలోని రైస్మిల్లుల్లో ఇప్పటివరకూ ఉన్న ధాన్యం నిల్వలు, పౌరసరఫరాల శాఖ ఎఫ్సీఐ గోదాంలకు పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన రికార్డులు సమగ్రమైన సమాచారంతో ఉండాలని పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారి బండి అశోక్ అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని పాపమ్మవలస, అప్పయ్యపేట, లక్ష్మీపురం గ్రామాల్లో గల రైస్మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల రికార్డులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పయ్యపేటలోని సత్యమోడరన్ బాయిల్డ్ అండ్ రా రైస్మిల్లును పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో 112 రైస్మిల్లులున్నాయని ఆయా మిల్లుల యాజమాన్యాలు పీఏసీఎస్ల ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ చేసినట్లు చెప్పారు. నిర్దేశించిన గడువులోగా ఈ క్రాప్ చేసిన రైతుల నుంచి ధాన్యం సేకరించామన్నారు. మిల్లర్లు నిబంధనల ప్రకారం ఎప్సీఐ గోదాంలకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నిత్యావసర సరుకులు, రేషన్ డిపోలద్వారా బియ్యం పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, రైస్మిల్లు యాజమాన్య ప్రతినిధి మున్నా, ఆర్ఎస్డీటీ పైడిరాజు, ఆర్ఐ ఎన్. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
8 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు


