
నేడు బేరం పెట్టారు?
మొన్న తీసేశారు..
● కేజీబీవీలో పోస్టు రూ.లక్ష అంట!
సాక్షి, పార్వతీపురం మన్యం:
సాలూరు మండలం కరాసువలస కేజీబీవీలో రాజకీయ కారణాలతో ఎస్ఓ, నలుగురు కుక్లను తొలగించిన విషయం విదితమే. ఎస్ఓ తొలగింపు అన్యాయమని గిరిజన, ఉపాధ్యాయ సంఘాలు ఘోషిస్తున్నప్పటికీ.. వెనుకడుగు వేయలేదు. పోస్టు లు తొలగించి ఎన్ని రోజులూ కాలేదు. అప్పుడే వాటికి ‘తమ్ముళ్లు’ బేరం పెట్టేశారు. కుక్ పోస్టుకు సైతం రూ.లక్ష చొప్పున రేటు కట్టారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. అన్యాయంగా మరొకరి పొట్ట కొట్టడమే కాక.. తమ కడుపు నింపుకొనేందుకు చిన్న పోస్టులను సైతం అమ్మకాలకు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టలేని కూటమి నేతలు.. ఉద్యోగులపై పడుతున్నారు. ప్రధానంగా చిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టు, అవు ట్ సోర్సింగ్ ఉద్యోగాలను నమ్ముకుని కుటుంబాల ను పోషించుకుంటున్న వారిపై కక్ష గడుతున్నారు. వారిని నిర్ధాక్షిణ్యంగా తొలగించి, ఆ స్థానాల్లో తమ వారిని నియమించుకుంటున్నారు. ఉపాధి హామీ, వెలుగు, కేజీబీవీలు, కంప్యూటర్ ఆపరేటర్లు.. ఇలా ఏ విభాగాన్నీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వెనక్కి తగ్గడం లేదు. అధికారులు సైతం ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కరాసువలస కేజీబీవీని సందర్శించారు. భోజనం నాణ్యత బాగోలేదన్న కారణాన్ని చూపి, ఎస్ఓతో పాటు.. సిబ్బందిని సస్పెండ్ చేయాలని అప్పటి నుంచి మంత్రి పట్టుపట్టారు. చివరికి పంతం నెగ్గించుకున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆదివాసీ ఉద్యోగులపై కక్ష సాధింపు
కరాసువలస కేజీబీవీ ఎస్ఓ ప్రశాంతి సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మువ్వల అమర్నాథ్, గిరిజన సంక్షేమ సంఘ నాయకులు పాలక రంజిత్కుమార్, తాడంగి సాయిబాబు, గిరిజన విద్యార్థి సంఘ నాయకులు పల్ల సురేష్, గిరిజన అభ్యుదయ సంఘ నాయకులు ఆరిక చంద్రశేఖర్, ఐక్యవేదిక నాయకులు ఆరిక విప్లవకుమార్, ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎఫ్ నాయకులు బి.రవికుమార్, ఇంటికుప్పల రామకృష్ణ, సింహాచలం, గిరిధర్ తదితరులు డిమాండ్ చేశారు. ఎస్ఓ తప్పు లేదని అధికారులు నివేదిక ఇచ్చినప్పటికీ.. ఎందుకు సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఆదివాసీ విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి, ఉపాధ్యాయ శిక్షణలు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, నిజాయితీగా పని చేస్తున్నారని.. చిన్న కారణాలతో వారిని సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మెమో జారీచేసి వివరణ కోరాలని.. అప్పటికీ సంతృప్తి చెందకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇటువంటివేవీ లేకుండా, ఏకంగా సస్పెండ్ చేయడం వెనుక ఇతర కారణాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

నేడు బేరం పెట్టారు?