
పిచ్చికుక్కల దాడిలో పలువురికి గాయాలు
గరుగుబిల్లి: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి పలువురిని గాయపరచడంతో ప్రజలు రాకపోకలు చేసేందుకు భీతిల్లుతున్నారు. గురుగుబిల్లి మండలంలోని రావుపల్లిలో గ్రామంలో పలువీధుల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేసి గ్రామానికి చెందిన గుల్ల సుహంత్, కుమ్మరి సూరయ్య తదితరులను శుక్రవారం గాయాల పాలుచేశాయి. కుక్కల బెడద కారణంగా ఒంటరిగా వీధుల్లో తిరిగేందుకు, ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే సాయంత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం అన్ని వర్గాలవారు రాకపోకలు చేసేందుకు భయాందోళన చెందుతున్నారు. గాయాలపాలైన వారు గరుగుబిల్లి పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. కుక్కలను నియంత్రించాలని అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
యువకుడి అదృశ్యం
పార్వతీపురం రూరల్: పట్టణంలోని బంగారమ్మ కాలనీకి చెందిన బుగత శ్రీనివాసరావు కుమారుడు అజయ్ కుమార్ అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం 7గంటల సమయంలో ఢిల్లీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు కుమరుడి రూమ్ సర్దుతున్న సందర్భంలో అజయ్ కుమార్ ఫోన్, పర్సు ఇంట్లోనే విడిచిపెట్టి నా గురించి వెతకకండి, నన్ను క్షమించండి అని రాసి ఉన్న పేపర్ను తల్లిదండ్రులు గమనించారు. దీంతో భయాందోళన చెంది పట్టణ పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవింద తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్స్టేషన్కు ఫోన్ 9121109467, 8341517437 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంటి నుంచి వెళ్లిన అజయ్ కుమార్ నీలం రంగు ఫ్యాంట్, క్రీమ్ కలర్ టీషర్టును ధరించినట్లు తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిపారు.
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
దత్తిరాజేరు: మండలంలోని ముద్దానపేట గ్రామానికి చెందిన రైతు ముద్దాన అప్పన్న(38) అప్పుల బాధలు తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు, పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి శుక్రవారం తెలిపారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పన్నకు వ్యవసాయంలో నష్టం రావడంతో మనస్తాపం చెంది ఈనెల 14న రాత్రి పురుగు మందు తాగడంతో వెంటనే కుటుంబసభ్యులు గజపతినగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో వైజాగ్ కేజీహెచ్కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నేలబావిలో పడి వ్యక్తి మృతి
రాజాం సిటీ: పట్టణ పరిధిలోని హరిజనవీధికి చెందిన రేజేటి సోమయ్య (54) నేలబావిలో పడి ప్రమాదవశాత్తు మృతిచెందాడని సీఐ కె.అశోక్కుమార్ శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమయ్య ఈ నెల 17న మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి శుక్రవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. మృతుడి సోదరుడు భాస్కరరావు తన అన్నయ్యను వెతుకుతూ కొండంపేట సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ నేలబావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి సోదరుడు సోమయ్యగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుని భార్య సరోజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

పిచ్చికుక్కల దాడిలో పలువురికి గాయాలు

పిచ్చికుక్కల దాడిలో పలువురికి గాయాలు