
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ సబ్కంట్రోల్
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ వకుల్ జిందల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందన్నారు. స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు, సినిమా హాల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లోనే ఉండడం వల్ల ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ తరచూ ఏర్పడుతుందన్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టడం కష్టంగా ఉంటుందని, దీనిని అధిగమించడానికే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామని ఇందులో భాగంగా ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసి, ప్రారంభించామన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బంది తీవ్రమైన వేసవి, వర్షా కాలంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి ఇబ్బంది లేకుండా ఈ సబ్ కంట్రోల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదే విధంగా చిన్న చిన్న దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటివి నియంత్రించ వచ్చునన్నారు. ఈ సబ్కంట్రోల్ రూమ్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ఏర్పాటు చేశామని, లౌడ్ స్పీకర్లను ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేటు, ఔటు గేటు, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సబ్ కంట్రోల్లో ఒక ఎస్సై, ఒక ఏఎస్సై, ఇద్దరు హెచ్సీలు, ముగ్గురు కానిస్టేబుల్స్ ఉంటారని, వారు ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా విధులు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ వకు ల్ జిందల్ పోలీసు అధికారులను ఆదేశించారు. కా ర్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివానరావు, ట్రాఫిక్ సీఐ సూరి నాయుడు, టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ట్రాఫిక్ ఎస్సైలు భాస్కరరావు, రవి, నూకరాజు , పీసీలు భాస్కర్, రమణలు పాల్గొన్నారు.